USA: తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో పాక్ చేస్తున్నది ఇసుమంతే: అమెరికా

  • ఉగ్రవాదంపై అమెరికా వార్షిక నివేదిక
  • పాక్ మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచన
  • నివేదిక పట్ల పాక్ విచారం
US report on counter terrorism point out Pakistan efforts

పాకిస్థాన్ కూడా తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకోవాలని, తన గడ్డపై ఎలాంటి టెర్రరిస్టు కార్యకలాపాలకు అనుమతించరాదని అమెరికా ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది. అమెరికా చెప్పినా, తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు పాక్ ఎప్పుడూ ప్రయత్నించడంలేదన్నది యథార్థం. తాజాగా ఇదే విషయాన్ని అగ్రరాజ్యం ఎత్తిచూపింది. తాజాగా, ఉగ్రవాదంపై అమెరికా వార్షిక నివేదిక వెలువరించింది.

ఈ నివేదికలో పాకిస్థాన్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. తీవ్రవాద వ్యతిరేక చర్యల్లో పాకిస్థాన్ భాగస్వామ్యం ఇసుమంతేనని వెల్లడించింది. ముష్కర మూకలపై చర్యలు తీసుకోవడం అటుంచి, భారత్ ను లక్ష్యంగా చేసుకుని హక్కానీ నెట్ వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలుపుతోందన్న నేపథ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా నివేదికలతో తమపై నిశిత విమర్శలు ఉండడం పట్ల పాకిస్థాన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లతో శాంతి ఒప్పందం కుదర్చడంలో పాత్ర పోషించామని, ఈ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించి అమెరికాకు సహకారం అందించామని పాక్ వెల్లడించింది.

కాగా, పాకిస్థాన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమీర్ రాణా దీనిపై స్పందిస్తూ, అమెరికా తాజా నివేదికలోని అంశాలు పాకిస్థాన్ కు విస్పష్ట హెచ్చరికలు అని అభివర్ణించారు. టెర్రరిస్టు వ్యతిరేక పోరాటంలో భాగంగా పాకిస్థాన్ నుంచి మరిన్ని చర్యలను అమెరికా కోరుకుంటోందని అన్నారు. ముఖ్యంగా టెర్రరిస్టు గ్రూపులకు ఆర్థిక భరోసా అందకుండా చేయడం, ముష్కర మూకలను నాశనం చేయడం వంటి అంశాల్లో పాక్ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని అమెరికా భావిస్తోందని రాణా తెలిపారు. ఇక, పాకిస్థాన్ విదేశాంగ శాఖ అమెరికా నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించింది. దక్షిణాసియాలో ఆల్ ఖైదా ప్రాబల్యం తగ్గిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారని, అయితే, అల్ ఖైదా బలహీనపడడంలో పాకిస్థాన్ పాత్రను ప్రస్తావించడంలో నిర్లక్ష్యం చూపారని అసంతృప్తి వెళ్లగక్కింది.

More Telugu News