Medak: ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుని, దారుణంగా మోసం చేశాడంటున్న యువతి!

  • మెదక్ జిల్లాలో ఘటన
  • రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని అంటున్న ప్రవీణ
  • కేసును విచారిస్తామన్న పోలీసులు
Police Case On Lover Fruad in Medak District

తనను ప్రేమించానంటే నమ్మి, దారుణంగా మోసపోయానని తెలంగాణలోని మెదక్ జిల్లా చిన్న శంకరం పేటకు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించి, తన దీన గాథను చెప్పగా, యువతికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై బాధిత యువతి ప్రవీణ వెల్లడించిన వివరాలలోకి వెళితే...

చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లికి చెందిన చింతాకుల ప్రవీణ అనే యువతి, అదే గ్రామానికి చెందిన యువకుడి ప్రేమలో పడింది. ప్రేమ వ్యవహారం ఏడాది పాటు సాగగా, అతన్ని నమ్మిన ప్రవీణ, అతనితో పాటు వెళ్లిపోయి, హైదరాబాద్ లో ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకుంది. రహస్యంగా జరిగిన తమ వివాహం తరువాత ఇద్దరమూ అక్కడే కాపురాన్ని ప్రారంభించామని ప్రవీణ వెల్లడించింది.

ఈ క్రమంలో ప్రవీణ గర్భం దాల్చగా, మాత్రలు ఇచ్చి గర్భస్రావం అయ్యేలా చేశాడు. ఆపై ప్రవీణ, విషయాన్ని ఇంట్లో చెప్పగా, గ్రామంలో పెద్దలు పంచాయతీ పెట్టారు. ఈ నెల 14న గ్రామస్థుల సమక్షంలో పంచాయతీ జరుగగా, తాళి కడతానని చెప్పిన లవర్, ఆపై కనిపించకుండా వెళ్లిపోయాడు.

దీంతో తనకు న్యాయం చేసి, అదే యువకుడితో వివాహం జరిపించి, తనతో కాపురం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె ప్రియుడితో మాట్లాడి, యువతికి న్యాయం జరిపించేందుకు కృషి చేస్తామని, లేకుంటే కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తామని వెల్లడించారు.

More Telugu News