Raghu Ramakrishnamraju: నా బొమ్మ పెట్టుకుని గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: మరోసారి ఫైర్ అయిన ఎంపీ రఘురామకృష్ణంరాజు

  • జగన్ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందే  చెప్పాను
  • కొట్టు సత్యనారాయణ అవినీతిపరుడు
  • ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి
MP Raghu Ramakrishnama Raju challenges YSRCP

వైసీపీ నేతల తీరుపై ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచాడంటూ నన్ను విమర్శించిన నాయకులంతా... ఈసారి జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. తన బొమ్మ పెట్టుకుని గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సింహం సింగిల్ గానే వస్తుందంటూ రజనీకాంత్ డైలాగును ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందే తాను చెప్పానని... చెప్పిన విధంగానే ఆయన ఇంటికి వెళ్లడానికి తాను ఇష్టపడకపోతే, ఎయిర్ పోర్టులో తనను కలిశారని చెప్పారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనను తిట్టారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఒక ఇసుక దొంగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల స్థలాలలో కూడా కోట్ల రూపాయలను దోపిడీ చేశారని ఆరోపించారు. ఆయన అరాచకాల గురించి ఆయన మేనల్లుడే చెపుతాడని అన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు హుందా కలిగిన వ్యక్తి అని కితాబునిచ్చారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని... ఈ విషయంలో ఆయన బాధపడ్డారని చెప్పారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే... తాను కూడా రాజీనామా చేస్తానని అన్నారు.

More Telugu News