Jagan: తాడేపల్లి నుంచి విశాఖకు బయలుదేరిన జగన్‌.. విశాఖ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన చంద్రబాబు

  • హెలికాప్టర్ లో బయలుదేరిన ముఖ్యమంత్రి 
  • బాధితుల కుటుంబాలను పరామర్శించనున్న జగన్
  • అనుమతిస్తే బాధితులను పరామర్శిస్తానన్న చంద్రబాబు 
jagan to reach vizag

విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి విశాఖకు హెలికాప్టర్ లో బయలుదేరారు. ఇక గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరినట్లు తెలిసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. అలాగే, ఆసుపత్రుల్లో చేరి, చికిత్స తీసుకుంటున్న వారిని కూడా పరామర్శిస్తారు.

మరోవైపు, కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటోన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో విశాఖపట్నం బయలుదేరే అవకాశం ఉంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు విశాఖలోని టీడీపీ నేతలు ముందుకు రావాలని ఇప్పటికే ఆయన కోరారు. విశాఖ వెళ్లేందుకు ఆయన కొద్ది సేపటి క్రితం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు. బాధితులను పరామర్శించి, అలాగే, సహాయక చర్యల్లో పాల్గొంటామని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే వెంటనే ఆయన విశాఖ బయలుదేరుతారు.

More Telugu News