Jyotiraditya Scindia: కాంగ్రెస్ కు షాక్.. మోదీని కలిసిన వెంటనే రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా

  • మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో భారీ కుదుపు
  • రాజీనామా లేఖను సోనియాకు పంపిన సింధియా
  • ట్విట్టర్ లో రాజీనామా లేఖను షేర్ చేసిన సింధియా
Jyotiraditya Scindia Quits Congress After Meeting PM Modi and Amit Shah

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ఈ ఉదయం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయిన నిమిషాల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. తన రాజీనామా లేఖను ట్విట్టర్ లో షేర్ చేశారు.

గత 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశానని... ఇప్పుడు మరో దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని లేఖలో సింధియా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని... తాను ఈ దిశగా ఏడాది క్రితం నుంచే ఆలోచిస్తున్నాననే విషయం మీకు తెలుసని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యం తనకు ముందు నుంచి ఉందని... అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన లక్ష్యాన్ని తాను సాధించలేనని చెప్పారు.

తన ప్రజలు, మద్దతుదారుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు... ఇప్పుడు మరో కొత్త ప్రారంభాన్ని ఆరంభించాలని భావిస్తున్నానని సింధియా తెలిపారు. దేశానికి ఇంత కాలం సేవ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. కాసేపట్లో సింధియా బీజేపీలో చేరే అవకాశం ఉంది. మరోవైపు సింధియా వెనుక దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో, మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. సింధియా మద్దతుతో బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

More Telugu News