ఆది మానవుడు సరిగ్గా ఎప్పుడు, ఎక్కడ పుట్టాడో తేల్చిన పరిశోధకులు!
- ఆఫ్రికాలోని గ్రేటర్ జాంబెజీ నది దక్షిణ ఒడ్డున మనిషి పుట్టుక
- 2 లక్షల ఏళ్ల క్రితమే పుట్టుక
- మైటోకాండ్రియల్ డీఎన్ఏ మ్యాపింగ్ ద్వారా నిర్ధారణ
గ్రేటర్ జాంబెజీ నది దక్షిణ ఒడ్డున 2 లక్షల సంవత్సరాలకు పూర్వం మనిషి జన్మించినట్టు పరిశోధకులు కచ్చితమైన నిర్ణయానికి వచ్చారు. ఈ నదికి ఆవల ఒడ్డున నమీబియా, జింబాబ్వే దేశాలు ఉన్నాయి. మైటోకాండ్రియల్ డీఎన్ఏ మ్యాపింగ్ ద్వారా పరిశోధనకారులు ఈ నిర్ణయానికి వచ్చారు. జాంబెజీ నది ఒడ్డున పుట్టిన మనిషి అదే ప్రాంతంలో 70 వేల ఏళ్లపాటు మనుగడ సాగించినట్టు పరిశోధన వెల్లడించింది. అయితే, తదనంతర వాతావరణ మార్పులతో వీరిలో కొన్ని జాతులు అంతరించిపోయాయని, మిగిలిన వారు ఆఫ్రికాలోని మిగతా ప్రాంతాలకు తరలిపోయినట్టు పరిశోధన వివరించింది. పరిశోధనకు సంబంధించిన వివరాలు ‘ది నేచర్’ పత్రిక తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
నిజానికి మనిషి ఆఫ్రికాలో పుట్టాడని గతంలో చాలా పరిశోధనలు చెప్పాయని, ఈ క్రమంలో ఇథియోపియా, మొరాకో, దక్షిణాఫ్రికా.. ఇలా ప్రాంతాల పేర్లు వినిపించాయని అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన గర్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్- సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన వనేసా హేస్ చెప్పారు. అయితే, మనిషి సరిగ్గా ఎక్కడ పుట్టాడన్న దానిపై తాము దృష్టిసారించి పదేళ్లుగా రకరకాల జాతుల వారి రక్త నమూనాలు సేకరించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. మానవాళి మొదట జన్మించిన ప్రదేశంగా గుర్తించిన ఆ ప్రాంతాన్ని ‘మక్గడిక్గాడి-ఒక్వాంగో’ అని పిలుస్తారని ఆమె వివరించారు.