వైసీపీలోకి వల్లభనేని వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ వర్గం
- వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నారంటూ ప్రచారం
- యార్లగడ్డ నివాసానికి చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు
- యార్లగడ్డ భవితవ్యం ఏమిటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం ఖాయమనే చెప్పుకుంటున్నారు. దీపావళి తర్వాత ఈ విషయంలో క్లారిటీ ఇస్తానని వంశీ ఇప్పటికే చెప్పారు. వంశీకి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు, వంశీ రాక గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. గత ఎన్నికల్లో వంశీ చేతిలో ఓటమిపాలైన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాకను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంకట్రావు ఇంటికి చేరుకుంటున్నారు. వంశీ వైసీపీలో చేరితే... యార్లగడ్డ భవితవ్యం ఏమిటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.