Social Media: జనవరి 15 నాటికి సోషల్ మీడియా నియంత్రణకు సరికొత్త నిబంధనలు

షార్ట్స్‌లో చూడండి
సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు, దూషణలు, పరస్పర ఆరోపణలు వంటి అవాంఛనీయ అంశాలకు అడ్డుకట్ట వేసేందుకు జనవరి 15 నాటికి సరికొత్త నియమావళికి రూపకల్పన చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కొంతకాలంగా సోషల్ మీడియా ఖాతాలను ఆధార్ తో అనుసంధానం చేసే విషయం చర్చకు వస్తోంది. తద్వారా ఫేక్ ఐడీలను నిరోధించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, దీనిపై మధ్యప్రదేశ్, మద్రాస్, బొంబాయి హైకోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు చేశారు.

అయితే, సోషల్ మీడియా నెట్వర్కింగ్ సంస్థలు అన్ని పిటిషన్లను ఒకే న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, దీనిపై నేడు విచారణ జరిగింది. వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టు తన ధర్మాసనం పరిధిలోకి బదిలీ చేయించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకలాపాలను నియంత్రించేందుకు వీలుగా నియమావళి ఏర్పాటుపై తమకు జనవరిలో నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ ధర్మాసనానికి బదిలీ అయిన పిటిషన్లపై వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది.
Go Back to Shorts
Social Media
Supreme Court
Facebook
Twitter
Instagram

More Telugu News