ఎన్ఐఏను మరింత బలోపేతం చేయాల్సిందే... ఎందుకంటే..!: లోక్ సభలో అమిత్ షా కీలక ప్రసంగం

  • ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో ఎన్ఐఏ అత్యద్భుతంగా పని చేస్తోంది
  • భర్తలను కోల్పోయిన జవాన్ల భార్యలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
  • ఉగ్ర కార్యకలాపాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షిస్తాం
ఉగ్ర కార్యకలాపాలపై విచారణ జరిపే కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సంస్థ ఎన్ఐఏను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఎన్ఐఏ సవరణ బిల్లుకు నిన్న లోక్ సభ ఆమోదముద్ర వేసింది. ఓటింగ్ ముందు చర్చ సందర్భంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రసంగం చేశారు.

లోక్ సభలో అమిత్ షా మాట్లాడుతూ, 'భారత్ లో, భారత్ వెలుపల ఉగ్ర సంబంధిత కేసులను విచారించే ఎన్ఐఏను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ఐఏ సవరణ బిల్లు - 2019 ఎన్ఐఏను మరింత శక్తిమంతం చేస్తుంది. 90 శాతం ఉగ్ర సంబంధిత కేసుల విచారణ ముగింపు దశలో ఉంది. టెర్రరిజం పీచమణిచే క్రమంలో ఎన్ఐఏ అత్యద్భుతంగా పని చేస్తోంది. దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమి కొట్టాలంటే ఎన్ఐఏని మరింత బలోపేతం చేయాలి' అని చెప్పారు.  

అధికారాలను ఎన్ఐఏ దుర్వినియోగం చేస్తోందనే విపక్షాల వ్యాఖ్యలకు సమాధానంగా... కేంద్ర పరిధిలోని అన్ని విచారణ సంస్థలు చట్టాలకు లోబడి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయని అమిత్ షా తెలిపారు. ఎన్ఐఏ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా (లెఫ్ట్ కానీ రైట్ కానీ) అది ఉగ్రవాదమే అని చెప్పారు. ఉగ్ర కార్యకలాపాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠనంగా శిక్షిస్తామని అన్నారు.

విధుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్యలు, కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా ఉంటుందని అమిత్ షా చెప్పారు. సైనికుల త్యాగాలను ఊరికే పోనివ్వమని తెలిపారు. అందుకే, ఎన్ఐఏను మరింత బలోపేతం చేయాలనుకుంటున్నామని... దేశం వెలుపల సైతం ఉగ్రకార్యకలాపాలపై ఎన్ఐఏ విచారించేలా చట్టాన్ని సవరించాలనుకుంటున్నామని... తద్వారా భర్తలను కోల్పోయిన జవాన్ల భార్యలకు న్యాయం చేకూరుతుందని చెప్పారు.

టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన 'సార్క్ అగ్రిమెంట్'పై పాకిస్థాన్ సంతకం చేయలేదనే విపక్ష నేతల ప్రశ్నకు బదులిస్తూ... రానున్న రోజుల్లో అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి, ఒప్పందంపై పాకిస్థాన్ కచ్చితంగా సంతకం చేస్తుందని తెలిపారు. పాకిస్థాన్ సంతకం చేయకపోయినా... పాక్ గడ్డపై నుంచి ఎదురవుతున్న టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు మనకు ఇతర దారులున్నాయని చెప్పారు.
Go Back to Shorts
Amitabh Bachchan
NIA Bill
Lok Sabha
Pakistan
Terrorism

More Telugu News