తనకు హిందీ తెలియదన్న ప్రయాణికుడు.. దురుసుగా ప్రవర్తించిన ముంబయ్ విమానాశ్రయ అధికారి!
- తమిళనాడుకు చెందిన అబ్రహాం శామ్యూల్
- ఆంగ్లంలో మాట్లాడేందుకు ప్రయత్నం
- నిరాకరించిన ఇమ్మిగ్రేషన్ అధికారి
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన అబ్రహాం శామ్యూల్ ముంబయ్ లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం వెళ్లారు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర ఆయన ఆంగ్లం, తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అక్కడి అధికారి 'హిందీలో మాట్లాడటం రాదా?' అంటూ అవమానకరంగా మాట్లాడారని శామ్యూల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ విషయాన్ని శామ్యూల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా నాలుగు నిమిషాల్లో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ఇప్పించారు. ‘భారత్లో ఇప్పటి వరకు హిందీ మాట్లాడటం రాని కారణంగా ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర ఎవరినీ నిలిపివేయలేదు. ముంబయ్ విమానాశ్రయంలోని కౌంటర్ 33 వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారి మాత్రం అలా చేశారు. నా పట్ల దురుసుగా ప్రవర్తించి అవమానపరిచే విధంగా మాట్లాడారు’ అంటూ శామ్యూల్ పోస్ట్ పెట్టారు. ప్రయాణికుల పట్ల ఇటువంటి ప్రవర్తనను తాము ఎంత మాత్రం అంగీకరించబోమని, దీనిపై విచారణ చేస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.