భగవంతుడన్న మాటే అసత్యం... మరణించే ముందు రాసిన చివరి పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేసిన స్టీఫెన్ హాకింగ్స్!
- మానవ భవిష్యత్తును ఎవరూ శాసించలేరు
- భూమిని వీడటం తప్ప మానవాళికి మరో మార్గం లేదు
- వాతావరణ మార్పులు సృష్టించే విపత్తు తెలిసేసరికే సమయం మించిపోతుంది
- 50 ఏళ్లలో జీవం పుట్టుకపై మరిన్ని విషయాలు తెలుస్తాయన్న హాకింగ్
మరణానంతరం స్వర్గం, నరకం వంటివేమీ ఉండవని, మరణానంతర జీవితమంటే, కోరికలతో నిండిన ఆలోచనలని చెప్పేందుకు ఆధారాలు లేవని కూడా ఆయన తన పుస్తకంలో రాశారు. భూమిని వీడటం తప్ప మానవాళికి మరో మార్గం లేదని, భూమిని వీడకుంటే మానవులంతా అంతరించిపోతారని ఆయన అంచనా వేశారు. మరో 100 సంవత్సరాల్లో మనిషి మేధస్సును కంప్యూటర్లు మించిపోనున్నాయని, మానసిక, శారీరక లక్షణాలను మెరుగుపరచుకోవడం తప్ప మానవాళి ముందు మరో మార్గం లేదని హెచ్చరించారు. జన్యు మార్పులతో 'సూపర్ హ్యూమన్'లను సృష్టిస్తే పెను ముప్పేనని కూడా అంచనా వేశారు.
వాతావరణ మార్పులు ఎటువంటి విపత్తును తీసుకు రానున్నాయన్న విషయం ప్రజలకు తెలిసేసరికే చాలా ఆలస్యం అయిపోతుందని, మరో 50 సంవత్సరాల్లో జీవం పుట్టుక, ఇతర గ్రహాల మీద జీవుల మనుగడపై అన్ని విషయాలూ అవగతమవుతాయని స్టీఫెన్ హాకింగ్ తన చివరి పుస్తకంలో పేర్కొన్నారు.