Nagarjuna: బ్యాంకుల నుంచి నిరసనలు తలెత్తడంతో.. నాగార్జున యాడ్ ను ఉపసంహరించుకున్న కల్యాణ్ జువెల్లర్స్!

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల ప్రసార మాధ్యమాల్లోకి వచ్చి కలకలం రేపిన కల్యాణ్ జువెల్లర్స్ యాడ్ ఇకపై కనిపించదు. తెలుగులో నాగార్జున, హిందీలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమార్తె శ్వేతా బచ్చన్ లతో రూపొందించిన ఈ వ్యాపార ప్రకటన బ్యాంకులపై నమ్మకం కోల్పోయేలా ఉందంటూ ఏఐబీవోసీ (ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్) అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, అన్ని మాధ్యమాల నుంచి యాడ్ ను తీసేస్తున్నట్టు కల్యాణ్ జువెల్లర్స్ ప్రకటించింది.

ఈ యాడ్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఏఐబీవోసీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో, కల్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కల్యాణరామన్, మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ యాడ్ ను కేవలం ప్రచారం కోసం మాత్రమే రూపొందించామని, అయితే దీనివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు తెలిపారని ఆయన అన్నారు.

తమ సంస్థ వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్థది కీలక పాత్రని, దేశంలోని బ్యాంకులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తూ, ఈ యాడ్ ను తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకులకు నష్టం కలిగించే చర్యలను తామెన్నడూ ప్రోత్సహించబోమని చెప్పారు.
Go Back to Shorts
Nagarjuna
Amitabh Bachchan
Kalyan Jewellers
Add
Banks

More Telugu News