యమదొంగ, లెజెండ్, ఛత్రపతి చిత్రాల్లో విలన్ గా చేసిన నటుడు నరేంద్ర ఝా గుండెపోటుతో మృతి!
పలు సూపర్ హిట్ తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆయన, కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ తో పాటు, టీవీ సీరియల్స్ లోనూ నటించారు. 2002లో 'ఫంటూష్' ద్వారా బాలీవుడ్ తెరపై తొలిసారి కనిపించిన ఆయన, 'గదర్', 'రాయీస్', 'మొహంజోదారో' వంటి హిందీ చిత్రాలతో పాటు తెలుగులో 'యమదొంగ', 'లెజండ్', 'ఛత్రపతి' తదితర చిత్రాల్లో నటించారు. సల్మాన్ హీరోగా త్వరలో రానున్న హిందీ చిత్రం 'రేస్-3' ఆయనకు ఆఖరి చిత్రం. కాగా, ఝా మృతిపట్ల పలువురు నటీ నటులు, నిర్మాతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.