పాక్‌ కదలికలపై ఇక 24 గంటల నిఘా.. ఈఓఎస్‌-05తో మారనున్న పరిస్థితులు?

పాక్‌ కదలికలపై ఇక 24 గంటల నిఘా.. ఈఓఎస్‌-05తో మారనున్న పరిస్థితులు?

EOS-05 to provide 24-hour surveillance on Pakistan movements
  • ఈఓఎస్‌-05తో ఉపఖండంపై నిరంతర నిఘా సాధ్యమన్న నివేదిక
  • పాక్‌ సైనిక కదలికలను గమనించే సామర్థ్యం పెరగనుందని వెల్లడి
  • ఈఓఎస్‌-05ను సెప్టెంబర్‌ 4న భూస్థిర కక్ష్యలోకి పంపిన భారత్‌
  • వ్యూహాత్మక సమాచారాన్ని అందించనున్న ఉపగ్రహం
  • నిరంతర నిఘాతో వేగవంతం కానున్న లక్ష్యాల గుర్తింపు
భారత్‌ అంతరిక్ష రంగంలో మరో కీలక అడుగు వేసింది. భూస్థిర కక్ష్యలోకి పంపిన ఈఓఎస్‌-05 ఉపగ్రహం దేశానికి నిరంతర నిఘా సామర్థ్యాన్ని అందించనుందని ‘ద డిప్లొమాట్‌’ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా సంక్షోభ సమయంలో పాకిస్థాన్‌ నౌకలు, విమానాలు, వ్యూహాత్మక వనరులు, సైనిక బలగాల కదలికలను ఎప్పటికప్పుడు గమనించే అవకాశం భారత్‌కు లభించనుందని తెలిపింది.

సెప్టెంబర్‌ 4న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 రాకెట్‌ ఈఓఎస్‌-05ను భూస్థిర కక్ష్యలోకి చేర్చింది. భూమికి దాదాపు 34,900 నుంచి 35,900 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఈ కక్ష్యతో భారత ఉపఖండంపై నిరంతర నిఘా కొనసాగించవచ్చు. ఈ ఉపగ్రహం ద్వారా దేశానికి వ్యూహాత్మక సమాచారాన్ని అందించే తొలి ప్రత్యేక ఇమేజింగ్‌ ఉపగ్రహంగా ఈఓఎస్‌-05 నిలుస్తుందని ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్‌ తెలిపారు.

భారత్‌ ఇప్పటికే పలు నిఘా ఉపగ్రహాలను దిగువ భూకక్ష్యలో ఉపయోగిస్తోంది. ఇవి అత్యంత స్పష్టమైన చిత్రాలను అందిస్తాయి. అయితే అవి భూమి చుట్టూ వేగంగా తిరుగుతుండటంతో ఒక ప్రాంతాన్ని నిరంతరం గమనించడం సాధ్యం కాదు. ఈఓఎస్‌-05 విషయంలో ఈ పరిమితి తగ్గనుంది.

సైనిక కదలికలను నిరంతరం గమనించడం వల్ల లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత దానిపై చర్య తీసుకునే సమయం తగ్గుతుందని నివేదిక తెలిపింది. కచ్చితమైన దాడులకు క్షిపణుల సామర్థ్యంతో పాటు లక్ష్యం ఎక్కడుందన్న తాజా సమాచారం కూడా కీలకమేనని పేర్కొంది.

ఇదే సమయంలో భారత్‌ తన అంతరిక్ష నిఘా వ్యవస్థను మరింత విస్తరించే ప్రణాళికలో ఉంది. 2024లో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ 52 రక్షణ ఉపగ్రహాలను ప్రయోగించే స్పేస్‌ బేస్డ్‌ సర్వైలెన్స్‌-3 కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. వీటిలో 21 ఉపగ్రహాలను ఇస్రో, 31 ఉపగ్రహాలను ప్రైవేటు రంగం అభివృద్ధి చేయనున్నాయి.
Advertisement
EOS 05
ISRO
Pakistan military surveillance
GSLV F17
Indian defense satellites
Space Based Surveillance 3

More Telugu News