పీడీఎస్ బియ్యం కేసులో బేరం.. ఏసీబీకి చిక్కిన ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్

పీడీఎస్ బియ్యం కేసులో బేరం.. ఏసీబీకి చిక్కిన ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్

CI and SI caught by ACB for taking bribe in PDS rice case
  • కీసరలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, ఎస్ఐ
  • రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
  • పీడీఎస్ బియ్యం కేసులో మొత్తం రూ.8.5 లక్షలు డిమాండ్
  • ఏసీబీని చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఎస్ఐ
  • ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్న అధికారులు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరలో రేషన్ (పీడీఎస్) బియ్యం అక్రమ రవాణా కేసులో నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసు అధికారులు పట్టుబడ్డారు. కీసర సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఆంజనేయులు, సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) జ్ఞానేందర్ రెడ్డి ఓ అక్రమ బియ్యం వ్యాపారి నుంచి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా నిన్న అర్ధరాత్రి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. 10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడిన కేసుకు సంబంధించి నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు సీఐ ఆంజనేయులు రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ. 8.5 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, ఈ నెల 2వ తేదీన ఫిర్యాదుదారుడి నుంచి మొదటి విడతగా రూ. 3.5 లక్షలు తీసుకున్నారు. మిగిలిన రూ. 5 లక్షల కోసం వారు ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, కీసర పెద్దమ్మ చెరువు సమీపంలో బాధితుడి నుంచి సీఐ, ఎస్ఐ నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను గమనించిన ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, అధికారులు వెంబడించి మరీ అతడిని పట్టుకున్నారు.

అనంతరం ఇద్దరు అధికారులు కెమికల్ పరీక్షలకు సహకరించేందుకు నిరాకరించినట్లు సమాచారం. నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షక భటులే ఇలా లంచం తీసుకుంటూ పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Advertisement
CI Anjaneyulu
SI Gnanender Reddy
Keesara ACB Raid
PDS Rice Smuggling Case
Telangana Police Corruption
Medchal Malkajgiri ACB Arrest

More Telugu News