రూ. 200 కోట్ల భూమిని రేవంత్ రెడ్డి ఆయన సోదరుడికి కట్టబెట్టాడు: కేటీఆర్
- రేవంత్ రెడ్డి తన 18 గంటల సమయాన్ని ఆయన సోదరుల కోసం కేటాయిస్తున్నారన్న కేటీఆర్
- లక్ష మూలధనం ఉన్న కంపెనీకి రూ. 200 కోట్ల భూమిని కట్టబెట్టారని ఆరోపణ
- ఈ భూ కుంభకోణంపై ఈడీ, సీబీఐలతో కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన షెల్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కట్టబెట్టారని, ఈ భూదోపిడీని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వరుసగా సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆ వివాదాస్పద భూ కేటాయింపు స్థలాన్ని ఈరోజు ఆయన సందర్శించిన పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని నిత్యం చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, ఆ సమయాన్నంతా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కాకుండా తన సొంత సోదరులు, బినామీ షెల్ కంపెనీల లబ్ధి కోసమే కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేవలం రూ. లక్ష మూలధనంతో నడిచే కంపెనీకి ఐదెకరాల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎవరైనా కేవలం లక్ష రూపాయలతో స్టార్టప్ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే వందల కోట్ల విలువైన భూములు ఇస్తుందా..? అని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇజ్రాయెల్ వ్యాపార భాగస్వామ్యాలపై ప్రధాని మోదీని ప్రశ్నిస్తుంటే, ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి సోదరుడి కోసం 'ఇజ్రాయెల్ ఇన్నోవేషన్' సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని ఏరోస్పేస్, డిఫెన్స్ వెంచర్ల పేరుతో భూములు కొల్లగొడుతోందని ఆరోపించారు.
నెలకు రూ.4,000 పింఛన్, మహిళలకు రూ.2,500, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలకు మొండిచేయి చూపించిన కాంగ్రెస్, సీఎం సొంత తమ్ముళ్లకు మాత్రం అద్భుతమైన ఉపాధి, వందల కోట్ల ఆస్తులు కట్టబెడుతోందని దుయ్యబట్టారు. ఈ భారీ భూ కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే తక్షణమే ప్రవర్తన, పత్రాలపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.