పల్నాడులో ఛాతీ నొప్పని వెళితే.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు.. వైద్యుల షాక్!

పల్నాడులో ఛాతీ నొప్పని వెళితే.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు.. వైద్యుల షాక్!

Palnadu woman goes for chest pain doctors find 14 pens and 5 spoons in her stomach
  • పల్నాడు జిల్లాలో మహిళ కడుపులో నుంచి 14 పెన్నులు, 5 స్పూన్ల తొలగింపు
  • మానసిక సమస్యల కారణంగానే ఆమె వస్తువులు మింగినట్లు గుర్తింపు
  • లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా సురక్షితంగా వస్తువులను బయటకు తీసిన వైద్యులు
పల్నాడు జిల్లాలో అత్యంత అరుదైన, విస్మయపరిచే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ కడుపులో నుంచి ఏకంగా 14 పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక కొవ్వొత్తిని వైద్యులు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఈ వస్తువులను మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలేనికి చెందిన 33 ఏళ్ల మహిళకు కొన్ని రోజులుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా, ఆమె కడుపులో పెద్ద సంఖ్యలో వస్తువులు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. వెంటనే లాప్రోస్కోపిక్ విధానంలో కడుపునకు చిన్న రంధ్రం చేసి, మొత్తం 20 వస్తువులను సురక్షితంగా తొలగించారు. ఆమె మింగిన ఓ పెన్నుకు క్యాప్ లేకపోవడంతో, అది కడుపులో గుచ్చుకుని నొప్పికి కారణమై ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని తెలిపారు.

ఆమె తండ్రి నోముల హనుమంతరావు మాట్లాడుతూ.. తన కుమార్తె గత 10 ఏళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని, రెండు నెలల క్రితమే భర్త విడాకులు ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానసిక వేదనతోనే ఆమె ఇలాంటి చర్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
Advertisement
Palnadu Woman
14 pens in stomach
Narasaraopet
Laparoscopic surgery
Mental health issues
Andhra Pradesh medical news

More Telugu News