అదే సంతోషం, అదే భావోద్వేగం: సోషల్ మీడియాలో చంద్రబాబు పోస్ట్

Chandrababu Naidu post on social media same happiness same emotion
  • ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలు
  • పాయకరావుపేటలో పోలవరం ఎడమ కాలువను ప్రారంభించిన సీఎం
  • గోదావరి తల్లికి జలహారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసిన చంద్రబాబు
  • రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేస్తానని వెల్లడి
  • లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యం
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలు గలగలా పారాయి. పాయకరావుపేట మండలం వద్ద పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విడుదల చేశారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఆయన గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేసి, జలహారతి ఇచ్చారు. అనంతరం కాలువ గట్టుపై సాష్టాంగ నమస్కారం చేసి తన మొక్కు తీర్చుకున్నారు.

ఈ కార్యక్రమంపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. "అదే సంతోషం.. అదే భావోద్వేగం! నిన్న మార్కాపురంలో బిరబిరా కృష్ణమ్మ.. నేడు అనకాపల్లిలో గలగలా గోదారమ్మ.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జీవనదుల పరవళ్లు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలకు జల హారతి ఇచ్చి ప్రణమిల్లాను. రాష్ట్రాన్ని చల్లగా చూడమని ప్రార్థించాను. కృష్ణా, గోదావరి సహా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తాను. అందుకు అవసరమైన శక్తిని ప్రసాదించమని గంగమ్మ తల్లిని కోరుకున్నాను" అని చంద్రబాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు. 

రూ. 4,192 కోట్లతో నిర్మించిన 213 కిలోమీటర్ల ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్రలోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో ఈ నీటితో అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపనున్నారు. దీన్ని విస్తరించి ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా నీరు అందించనున్నారు. 
Advertisement
Chandrababu Naidu
Godavari Waters
Polavaram Left Main Canal
North Andhra
Anakapalli District
River Interlinking

More Telugu News