నేపాల్ వరదల్లో కైలాస యాత్రికులు గల్లంతు.. ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న తెలుగు కుటుంబాలు

Kailash Mansarovar pilgrims missing in Nepal floods as Telugu families wait for news
  • నేపాల్ వరదల్లో పలువురు కైలాస యాత్రికులు గల్లంతు
  • లభ్యం కాని హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై కుటుంబం
  • మరో యాత్రికుడు ధన్‌పాల్ రెడ్డి కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపు
  • గల్లంతైన వారిలో ఏపీకి చెందిన ఎన్నారై కూడా ఉన్నట్లు సమాచారం
  • సమాచారం అందక ఆందోళనలో పలు తెలుగు కుటుంబాలు
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన పలువురు తెలుగు యాత్రికులు నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతయ్యారు. వీరిలో ప్రవాస భారతీయులు కూడా ఉండటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 26న ఈ విపత్తు సంభవించినప్పటి నుంచి వారి గురించి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, సమాచారం చేరడంలో జాప్యం జరుగుతుండటంతో బాధితుల కుటుంబాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై శ్రీధర్ అవ్వారి, ఆయన భార్య దీప్తి, 14 ఏళ్ల కుమారుడు అభినవ్‌ ఆగస్టు 13న ఈశా ఫౌండేషన్ బృందంతో కలిసి యాత్రకు వెళ్లారు. ఆగస్టు 26 నుంచి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఈశా ఫౌండేషన్‌ను సంప్రదించారు. యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో, నేపాల్-చైనా సరిహద్దులోని ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద వారు వరదల్లో చిక్కుకున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారని దీప్తి సోదరుడి భార్య ప్రియాంక రాపాక వివరించారు.

మణికొండకు చెందిన 38 ఏళ్ల ధన్‌పాల్ రెడ్డి ఆచూకీ కూడా ఇంకా లభ్యం కాలేదు. పుణే నుంచి వెళ్లిన 66 మంది యాత్రికుల బృందంలో తెంలగాణకు చెందిన వ్యక్తి ఈయన ఒక్కరే. వరదలు సంభవించిన రోజున నేపాల్ ఇమ్మిగ్రేషన్ సెంటర్ నుంచి ఆయన చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన ఆచూకీ కోసం బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. చేతులు, భుజాలపై ఉన్న శివుడి టాటూల ద్వారా తన భర్తను గుర్తించవచ్చని ఆయన భార్య సుప్రియ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బాధితుని కుటుంబ సభ్యులతో మాట్లాడి, తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన, ప్రస్తుతం ఖతార్‌లో నివసిస్తున్న ఎన్నారై చొప్పరపు రమేశ్‌బాబు సైతం ఇదే యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. మరోవైపు, ఇదే మార్గంలో యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన రాజేశ్వరి అనే మహిళ, ఈ విపత్తు సంభవించడానికి నాలుగు రోజుల ముందే సురక్షితంగా తిరిగి రావడం గమనార్హం.
Advertisement
Kailash Mansarovar Pilgrims
Nepal Floods
Telugu Pilgrims Missing
Sridhar Avvari
Dhanpal Reddy
Isha Foundation

More Telugu News