డీఎంకే హయాంలోని ఆ కేసులన్నీ వాపస్: సీఎం విజయ్ ప్రకటన

Vijay withdraws all cases filed during DMK tenure
  • రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసుల ఎత్తివేతకు సీఎం విజయ్ ఆదేశం
  • గత డీఎంకే ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులు
  • సిప్‌కాట్, పరందూర్ ఎయిర్‌పోర్ట్ నిరసనకారులకు ఊరట
  • ప్రజల్లో విశ్వాసం పెంచేందుకే ఈ నిర్ణయమన్న సీఎం విజయ్
  • నీట్, ఎన్‌ఎల్‌సీ నిరసనకారుల కేసులపైనా కొనసాగుతున్న డిమాండ్లు
తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా నిరసనకారులకు భారీ ఊరట లభించినట్లయింది.

2021 మే నుంచి 2026 మధ్య కాలంలో అప్పటి ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం సిప్‌కాట్ పారిశ్రామిక వాడ, పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలిపిన వారిపై అమానుషంగా వ్యవహరించిందని విజయ్ విమర్శించారు. ఆ సమయంలో రైతులు, ఉపాధ్యాయులపై పలు కేసులు నమోదు చేశారని, అవి ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రజల న్యాయమైన డిమాండ్లకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని విజయ్ స్పష్టం చేశారు. కేసుల ఎత్తివేత నిర్ణయం ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, 'నీట్'కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని సీపీఐ, ఎన్‌ఎల్‌సీ ఆందోళనకారులపై కేసులను రద్దు చేయాలని పీఎంకే పార్టీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే, ఈ డిమాండ్లపై టీవీకే ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.
Advertisement
Vijay
TVK Government
Tamil Nadu
DMK cases withdrawal
Farmers and teachers protests

More Telugu News