రేంజ్‌ రోవర్‌ ఎలక్ట్రిక్‌ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్‌తో 600 కి.మీ.. ఇండియాలో బుకింగ్స్‌ ఓపెన్‌

Range Rover Electric arrives with 600 km range and bookings open in India
  • రేంజ్‌ రోవర్‌ సిరీస్ లో తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ
  • 118.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి
  • ఫుల్‌ ఛార్జ్‌పై 600 కి.మీ రేంజ్‌ లభ్యం
  • 542 hp పవర్‌, 850 Nm టార్క్‌
  • 22 నిమిషాల్లో 10-80% ఛార్జింగ్‌
లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో సంచలనం సృష్టించేలా ల్యాండ్ రోవర్ కంపెనీ రేంజ్‌ రోవర్‌ సిరీస్ లో తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. భారత్‌లో ఈ కొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీకి బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ధరను మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు. స్టాండర్డ్‌ వీల్‌బేస్‌లో ఆటోబయోగ్రఫీ, ఫస్ట్‌ ఎడిషన్‌ వేరియంట్లతో పాటు లాంగ్‌ వీల్‌బేస్‌లో ఎస్‌వీ, ఎస్‌వీ అల్ట్రా, ఎస్‌వీ బ్లాక్‌ వేరియంట్లను భారత్‌లో అందించనున్నారు.

బ్యాటరీ, పవర్‌..
రేంజ్‌ రోవర్‌ ఎలక్ట్రిక్‌లో 118.5 kWh ఉపయోగించగల లిథియం-అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఇందులో 344 ప్రిస్మాటిక్‌ సెల్స్‌ ఉన్నాయి. 800V ఎలక్ట్రికల్‌ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. రెండు పర్మనెంట్‌ మాగ్నెట్‌ ఎలక్ట్రిక్‌ మోటార్లు కలిపి 542 hp పవర్‌, 850 Nm టార్క్‌ ఇస్తాయి. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే డబ్ల్యూఎల్‌టీపీ లెక్కల ప్రకారం 600 కి.మీ వరకు ప్రయాణించవచ్చని ల్యాండ్ రోవర్ చెబుతోంది.

22 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జింగ్‌
ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ 350kW వరకు డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అనుకూలమైన ఫాస్ట్‌ ఛార్జర్‌ ఉపయోగిస్తే బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి సుమారు 22 నిమిషాల్లో ఛార్జ్‌ చేయవచ్చని కంపెనీ తెలిపింది. గరిష్ఠ ఛార్జింగ్‌ రేట్‌తో కేవలం 10 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 125 మైళ్ల వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ లభిస్తుందని పేర్కొంది.

ఆఫ్‌రోడింగ్‌లోనూ తగ్గేదేలే
ఎలక్ట్రిక్‌ మోడల్‌లో కొత్త ట్రాక్షన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంది. ఇది కేవలం 50 మిల్లీసెకన్లలో స్పందించగలదని కంపెనీ చెబుతోంది. వివిధ రకాల రోడ్లపై గ్రిప్‌ను మెరుగుపరచడంతో పాటు ఆఫ్‌రోడ్‌ సామర్థ్యాన్ని కొనసాగించేలా దీన్ని రూపొందించారు. 35 అంగుళాల లోతు వరకు నీటిలోనూ ఎస్‌యూవీ ప్రయాణించగలదు.

సింగిల్‌-పెడల్‌ డ్రైవింగ్‌ మోడ్‌ కూడా ఇందులో ఉంది. యాక్సిలరేటర్‌ పెడల్‌తోనే వేగాన్ని పెంచడం, తగ్గించడం చేయవచ్చు. వేగాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా బ్రేక్ పెడల్ ను తొక్కాల్సిన అవసరం ఉండదు. ఇక, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌ ద్వారా బ్యాటరీలోకి శక్తిని తిరిగి పంపుతుంది. 45 డిగ్రీల వరకు వాలు ప్రాంతాలను ఎక్కగలదని కంపెనీ తెలిపింది. తక్కువ గురుత్వ కేంద్రం, ట్విన్‌-ఛాంబర్‌ ఎయిర్‌ సస్పెన్షన్‌ కారణంగా రైడ్‌ కంఫర్ట్‌, హ్యాండ్లింగ్‌ మెరుగ్గా ఉంటాయని పేర్కొంది.

భూమి చుట్టూ 38 సార్లు తిరిగినంత టెస్టింగ్‌
రేంజ్‌ రోవర్‌ ఎలక్ట్రిక్‌ అభివృద్ధి కోసం భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించినట్లు ల్యాండ్‌ రోవర్‌ తెలిపింది. ఫిజికల్‌ టెస్టింగ్‌లో భాగంగా ఈ ఎస్‌యూవీ భూమి చుట్టూ 38 సార్లు తిరిగే దూరానికి సమానమైన ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇంజినీర్లు 2.5 లక్షల గంటలకు పైగా వర్చువల్‌ వాలిడేషన్‌ కూడా నిర్వహించారు.

ఇండియాలో ధర వివరాలు త్వరలోనే...!
రేంజ్‌ రోవర్‌ ఎలక్ట్రిక్‌ను భారత్‌లో పూర్తిగా దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ధరను త్వరలో ప్రకటించనున్నారు. బ్రిటన్‌లో దీని ధర 1,54,070 పౌండ్ల నుంచి ప్రారంభమవుతోంది. జేఎల్‌ఆర్‌కు చెందిన ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ తయారవుతోంది.
Advertisement
Range Rover Electric
Land Rover India
Electric SUV
Range Rover EV Bookings
JLR India
Luxury Electric Vehicle

More Telugu News