ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్‌ సుభాష్ చంద్రకు చుక్కెదురు.. ఆస్తుల బదిలీపై నిషేధం

Subhash Chandra Essel Group Chairman faces setback as NCLT bans asset transfer
  • రూ.22 వేల కోట్ల రుణానికి రూ.6.5 కోట్ల చెల్లింపు ప్లాన్‌పై స్టే
  • ఆయన ఆస్తులను అమ్మకుండా, బదిలీ చేయకుండా నిషేధం
  • చరిత్రలో తొలిసారిగా కేసు విచారణకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం
  • తదుపరి విచారణ సెప్టెంబర్ 23వ తేదీకి వాయిదా
ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.22,000 కోట్ల రుణానికి బదులుగా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించి పరిష్కరించుకునేందుకు ఆయన ప్రతిపాదించిన రుణ ప్రణాళికపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) స్టే విధించింది. అంతేకాకుండా, ఆయన తన ఆస్తులను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బదిలీ చేయడం, విక్రయించడంపై నిషేధం విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసు విచారణ కోసం చరిత్రలో తొలిసారిగా ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఎన్‌సీఎల్‌టీ ప్రెసిడెంట్ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ నేతృత్వంలోని ఈ బెంచ్, గతంలో ఇచ్చిన తీర్పుపై స్పష్టమైన మెజారిటీ అభిప్రాయం లేనందున, ఈ దశలో తుది ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్ర చెల్లింపుల ప్రణాళికకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో సంబంధిత వర్గాలన్నింటికీ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, తదుపరి విచారణను సెప్టెంబర్ 23వ తేదీకి వాయిదా వేసింది.

గతంలో ఈ కేసును విచారించిన ముగ్గురు సభ్యుల బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో స్పష్టమైన మెజారిటీ తీర్పు కొరవడింది. ఈ క్రమంలోనే కేసును ఎన్‌సీఎల్‌టీ ప్రెసిడెంట్‌కు పంపగా, ఆయన ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు, సుభాష్ చంద్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న బ్యాంకులు, రుణ సంస్థలు దాఖలు చేసిన అప్పీల్‌ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్ఏ‌టీ) విచారణకు స్వీకరించింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టనుంది.
Advertisement
Subhash Chandra
Essel Group
NCLT
Personal Insolvency
Asset Transfer Ban
Debt Resolution

More Telugu News