Advertisement

హరీశ్‌రావునైనా క్షమిస్తానేమో కానీ.. ప్రశాంత్‌రెడ్డిని క్షమించను: కవిత

Kalvakuntla Kavitha says she might forgive Harish Rao but never Prashanth Reddy
  • బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయని ఆరోపణ
  • ప్రశాంత్‌రెడ్డి తనను తండ్రికి దూరం చేశారని ఆవేదన
  • పుట్టింటి వాళ్లే కుట్ర పన్నారంటూ సభలో భావోద్వేగం
  • లక్ష కోట్ల కాళేశ్వరంతో నిజామాబాద్‌కు నీళ్లు ఇవ్వలేదని విమర్శ
  • వెయ్యి రోజులైనా హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్‌పై విమర్శలు
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి కారణంగానే ఆ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మౌనంగా ఉందని ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె ప్రసంగించారు.

బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్లలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుందని కవిత విమర్శించారు. ఆ పార్టీ హయాంలో నాలుగు ఇళ్లు మాత్రమే బంగారమయ్యాయని ఎద్దేవా చేశారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్‌లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందించలేకపోయారని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ప్రశాంత్‌రెడ్డి తనను తండ్రి నుంచి దూరం చేశారని, ఆయనకు తన ఉసురు తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్‌రావు, సంతోష్‌రావును క్షమించినా ప్రశాంత్ రెడ్డిని మాత్రం జీవితంలో క్షమించనని స్పష్టం చేశారు. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే పుట్టింటి వాళ్లే కుట్ర చేసి తరిమేశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

తాను ఏ తప్పూ చేయకపోయినా నాలుగేళ్లుగా ఈడీ, సీబీఐలతో వేధించి తీహార్ జైలులో పెట్టారని కవిత అన్నారు. తాను నిర్దోషినని సుప్రీంకోర్టే చెప్పిందని, దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక సీబీఐ అధికారిపైనే విచారణకు ఆదేశించిందని గుర్తుచేశారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే పంతం పట్టి పార్టీ పెట్టానని, పదవుల కోసం కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిద్రపోతోందని విమర్శించారు.
Advertisement
Kalvakuntla Kavitha
Prashanth Reddy
Harish Rao
Telangana Rakshana Sena
Nizamabad
BRS Congress Alliance

More Telugu News