ప్రాణదాతగా మారిన ప్రిన్సిపల్.. సమయస్ఫూర్తితో 1643 మంది పిల్లలను కాపాడిన రియల్ హీరో!

Rajendra Dawadi the principal who saved 1643 children with quick thinking
  • వరద ముంచెత్తడానికి నిమిషాల ముందు స్కూల్ గంట మోగించి పిల్లలందరీ తరలింపు
  • ప్రిన్సిపల్ సమయస్ఫూర్తితో విద్యార్థులంతా ప్రాణాలతో బయటపడ్డ వైనం
  • ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పాఠశాల సిబ్బంది
సమయస్ఫూర్తితో తీసుకున్న ఒక నిర్ణయం వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. విధి సవాల్ విసిరిన వేళ ఒక సాధారణ ఉపాధ్యాయుడు అసాధారణ హీరోగా నిలిచాడు. నేపాల్‌లో ఆకస్మిక వరదలు పాఠశాలను ముంచెత్తడానికి కేవలం కొద్ది నిమిషాల ముందు, 1643 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారి ప్రాణాలను కాపాడారు ఓ ప్రిన్సిపల్. ఆయన చూపిన ధైర్యం, కర్తవ్య నిరతిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

నేపాల్‌లోని నువాకోట్ జిల్లా, త్రిశూలి లోయలో ఉన్న త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 26 ఉదయం సుమారు 9:20 గంటలకు పాఠశాల ప్రిన్సిపల్, 47 ఏళ్ల ఇంగ్లీష్ టీచర్ అయిన రాజేంద్ర దవాడీకి తన స్నేహితుడి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సమీపంలోని ఒక గ్రామం పూర్తిగా వరదలో కొట్టుకుపోయిందని, వెంటనే అక్కడి నుంచి పారిపొమ్మని ఆ స్నేహితుడు హెచ్చరించాడు. అదే సమయంలో ఓ విద్యార్థి తండ్రి పరుగెత్తుకుంటూ వచ్చి నీటి మట్టం వేగంగా పెరుగుతోందని చెప్పాడు.

పరిస్థితి తీవ్రతను క్షణాల్లో అర్థం చేసుకున్న రాజేంద్ర దవాడీ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే పాఠశాల గంటను మోగించారు. తరగతి గదుల్లోని విద్యార్థులందరినీ బయటకు తీసుకురావాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. స్కూల్ బస్ డ్రైవర్లకు ఫోన్ చేసి వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. ఆయన హెచ్చరికతో విద్యార్థులంతా సమీపంలోని ఎత్తైన ప్రదేశానికి పరుగులు తీశారు. అందరూ ఓ బోధి వృక్షం కింద తలదాచుకున్నారు. వారు అలా వెళ్లిన కొద్ది నిమిషాలకే, పెను ప్రవాహంతో వచ్చిన వరద నీరు మూడు అంతస్తుల కాంక్రీట్ పాఠశాల భవనాలను పేకమేడల్లా కూల్చేసింది.

ప్రిన్సిపల్ సత్వర నిర్ణయం వల్ల 1643 మంది విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఉపాధ్యాయ సిబ్బందిలో చాలామంది సురక్షితంగా బయటపడగా, దురదృష్టవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నది ఒడ్డున ఉన్న తన గదికి వెళ్లిన 32 ఏళ్ల సోషల్ హిస్టరీ టీచర్ సంతోష్ పరియార్, పాఠశాల జానిటర్ సుల్తాన్ లామా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి మరణించారు.

అయితే, తనపై వస్తున్న ప్రశంసలపై రాజేంద్ర దవాడీ ఎంతో వినమ్రంగా స్పందించారు. "ఆ సమయంలో నేను చేయగలిగింది ఇంకేముంది?" అని ఆయన వ్యాఖ్యానించారు. 
Advertisement
Rajendra Dawadi
Nepal flash floods
Tribhuvan Trishuli Secondary School
Nepal school hero principal
Glacier collapse disaster
Nuwakot district Trishuli

More Telugu News