ఒక కప్పు టీ.. ఐదు ప్రాణాలు.. నేపాల్ వరద బీభత్సం నుంచి సురక్షితంగా తిరిగొచ్చిన స్నేహితులు

A cup of tea saves five lives of Chhattisgarh friends from Nepal flood havoc
  • నేపాల్ వరదల్లో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు
  • టీ తాగేందుకు 15 నిమిషాలు ఆగడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న వైనం
  • రెండు రాత్రులు అద్దె కారులోనే ఉండి భయాందోళనతో గడిపారు
  • వరద ఉద్ధృతికి కార్లు, మృతదేహాలు కొట్టుకుపోవడాన్ని కళ్లారా చూశామ‌ని వెల్ల‌డి
  • భారత ప్రభుత్వ సహాయంతో సురక్షితంగా స్వస్థలాలకు చేరిక‌
సాధారణంగా ఒక కప్పు టీ సేద తీరుస్తుంది. కానీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు స్నేహితులకు మాత్రం అదే టీ వారి ప్రాణాలను కాపాడింది. నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరద బీభత్సం నుంచి వారు కేవలం 15 నిమిషాల తేడాతో అద్భుతంగా బయటపడ్డారు. యాత్రకు వెళ్లి చావు అంచుల దాకా వెళ్లివచ్చిన ఆ స్నేహితులు, సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని మానా క్యాంప్ ప్రాంతానికి చెందిన నారాయణ్ సేన్ (53), దినేష్ ఓఝా, ప్రేమ్ సింగ్ జగత్, యతేంద్ర ప్రకాశ్, దినేష్ సింగ్ ఠాకూర్ అనే ఐదుగురు స్నేహితులు ఆగస్టు 21న నేపాల్ యాత్రకు బయలుదేరారు. పశుపతినాథ్, మనోకామన వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వారు ఒక కారును అద్దెకు తీసుకున్నారు.

ఆగస్టు 26న ఉదయం 9:30-10 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న మార్గంలో ధాదింగ్ జిల్లాలోని మలేఖు పట్టణంలో ఒక హోటల్ వద్ద టీ తాగేందుకు ఆగారు. అదే వారిని పెను ప్రమాదం నుంచి రక్షించింది. "మేం టీ కోసం ఆగడం మా అదృష్టం. ఒకవేళ 10-15 నిమిషాలు ముందుగా బయలుదేరి ఉంటే, వరదల్లో చిక్కుకుపోయి ఉండేవాళ్లం. అక్కడ ఆగకపోయి ఉంటే ఏమయ్యేదో ఊహించుకోలేకపోతున్నాం" అని బృందంలోని నారాయణ్ సేన్ తెలిపారు.

వారు హోటల్‌లో ఉండగానే, భోటే కోశి, త్రిశూలి నదులకు ఆకస్మిక వరదలు వచ్చి ముందున్న వంతెన కొట్టుకుపోయిందని తెలిసింది. ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తుండగానే, త్రిశూలి నది ఉగ్రరూపం దాల్చింది. కార్లు, మృతదేహాలు, చెత్తాచెదారం నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని వారు కళ్లారా చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం రెండు రాత్రులు అద్దె కారులోనే భయంతో గడిపారు. ఇంటర్నెట్, భారత ప్రభుత్వ హెల్ప్‌లైన్ ద్వారా తమ కుటుంబాలతో టచ్‌లో ఉన్నారు.

ఆ భయానక దృశ్యాలను మాటల్లో వర్ణించలేమని, తామంతా శివుడి నామాన్ని స్మరించుకుంటూ గడిపామని బృందంలోని పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దినేష్ సింగ్ ఠాకూర్ చెప్పారు. అదే సమయంలో రక్షా బంధన్ సందర్భంగా మహిళా భద్రతా సిబ్బంది తమ చేతులకు రాఖీలు కట్టడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని వారు గుర్తుచేసుకున్నారు. స్థానికులు, అధికారుల సహాయంతో వారు ఆగస్టు 28న నేపాల్ నుంచి బయలుదేరి, శనివారం నాటికి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ, కళ్లారా చూసిన ఆ బీభత్సం తమను జీవితాంతం వెంటాడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Narayan Sen
Nepal floods survival story
Chhattisgarh tourists Nepal
Trishuli river flash floods
Raipur friends Nepal flood
Nepal landslide survival

More Telugu News