ఆప్ నేత హత్య కేసులో పురోగతి.. నిందితులను గుర్తించిన పోలీసులు

Gurpreet Singh Gopi murder case progress as police identify suspects
  • పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఆప్ నేత గుర్‌ప్రీత్ సింగ్ హత్య
  • బైక్‌పై వెళుతుండ‌గా కారులో వచ్చి దుండగుల కాల్పులు
  • రాజకీయ కక్షల వల్లే హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • నిందితులను గుర్తించామని, త్వరలో అరెస్ట్ చేస్తామని వెల్లడి
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఫిరోజ్‌పూర్ జిల్లా మమ్‌దోత్ పట్టణంలో గుర్‌ప్రీత్ సింగ్ గోపి అనే నేతను దుండగులు కాల్చి చంపారు. నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజకీయ కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

గుర్‌ప్రీత్ సింగ్ తన స్నేహితుడు హర్‌ప్రీత్‌తో కలిసి మోటార్ సైకిల్‌పై వెళుతుండ‌గా, వారి వెనుక మరో వాహనంలో మరికొంతమంది స్నేహితులు వస్తున్నారు. ఈ క్రమంలో మమ్‌దోత్ పట్టణ సమీపంలో కారులో వచ్చిన దుండగులు, గుర్‌ప్రీత్ బైక్‌ను వెంబడించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుర్‌ప్రీత్ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక వస్తున్న స్నేహితుల వాహనంపై కూడా దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ శతృత్వం కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఎస్ఎస్‌పీ భూపీందర్ సింగ్ తెలిపారు. ప్రధాన నిందితుడికి నేరచరిత్ర ఉందని, అతను గతంలోనూ పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితులను ఇప్పటికే గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించామని ఎస్ఎస్‌పీ వివరించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Gurpreet Singh Gopi
Aam Aadmi Party
Punjab Police
Firozpur murder case
Political rivalry murder
AAP leader shooting

More Telugu News