బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

  • మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
  • సెప్టెంబర్ 2 వరకు వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వెల్లడి
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమ్తంగా ఉండాలని హెచ్చరిక

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే కొద్దిరోజుల్లో వర్షాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న ఈ వాతావరణ మార్పుల నేపధ్యంలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వాసులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాల తీవ్రత సెప్టెంబర్ 2 వరకు కొనసాగే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, రాజధాని హైదరాబాద్‌లో రానున్న 24 గంటల్లో ఆకాశం దట్టంగా మేఘావృతమై అప్పుడప్పుడు వాన చినుకులు పడే అవకాశం ఉందన్నారు.


వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని... చెట్లు, భారీ విద్యుత్ స్తంభాలు, పాత భవనాల కింద నిలబడ వద్దని హెచ్చరించారు. వర్షం కురుస్తున్న సమయాల్లో వాహనదారులు ప్రయాణాల్లో వేగాన్ని తగ్గించి జాగరూకతతో వాహనాలు నడపాలని విపత్తు నిర్వహణ శాఖ కోరింది.

Advertisement

More Telugu News