ఒంగోలులో మహనీయుల స్ఫూర్తి.. 20 విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్‌

Nara Lokesh unveils 20 statues of great personalities in Ongole
  • జిల్లా సంస్కృతికి ప్రతీకగా ఒంగోలు గిత్త విగ్రహం ఆవిష్కరణ
  • మహనీయుల సేవలను భావితరాలకు తెలియజేయడమే లక్ష్యమన్న లోకేశ్‌
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు
  • వివిధ రంగాలకు చెందిన మహనీయుల విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు
సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను భావితరాలకు అందించాలనే ఉన్నత లక్ష్యంతో ఒంగోలు నగరంలో భారీ కార్యక్రమం జరిగింది. నగరంలోని కిమ్స్ హాస్పిటల్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇదే వేదికపై ప్రకాశం జిల్లా సంస్కృతి, పశుసంపదకు ప్రతీకగా నిలిచే ఒంగోలు గిత్త విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, మహనీయుల జీవితాలు, వారి సేవలు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, విద్యా, సాహిత్య రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖుల విగ్రహాలను ఒకేచోట ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం కనిపించేలా ప్రధాన కూడలిలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా మహనీయుల సేవలు, త్యాగాలు, ఆశయాలు ప్రజలకు మరింత చేరువవుతాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తిదాయక విగ్రహాలు ఒంగోలు నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆయన తెలిపారు.

ఒంగోలు గిత్త.. జిల్లాకే గర్వకారణం
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ఒంగోలు జాతి పశువుల విశిష్టతను చాటిచెప్పేలా, జిల్లా సంస్కృతికి అద్దం పట్టేలా ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రకాశం జిల్లా పశుసంపదకు, వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, దీని ప్రాముఖ్యతను భావితరాలకు పరిచయం చేస్తుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్ రావు, ఉగ్ర నరిసింహారెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించిన విగ్రహాల వివరాలు:

రాజకీయ, స్వాతంత్ర్య సమరయోధులు: రొండా నారపరెడ్డి (మాజీ మంత్రి, ఎంపీ), దర్శి చెంచయ్య (స్వాతంత్ర్య సమరయోధుడు), మాదాల నారాయణ స్వామి (మాజీ ఎంపీ, ఎమ్మెల్యే)

సామాజిక సేవకులు, విద్యావేత్తలు, అధికారులు: కత్తి చంద్రయ్య (ప్రకాశం జిల్లా తొలి కలెక్టర్), వరదా శ్రీరాముల నాయుడు (ఒంగోలు తొలి పురపాలక సంఘ అధ్యక్షులు), బివియల్ నారాయణ (‘పావలా డాక్టర్’), క్లౌ జాన్ ఎవరెట్ (సామాజిక సేవకులు), గోరంట్ల వెంకన్న (మహాదాత), శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి (ద్రావిడ భాషాశాస్త్ర పితామహులు), బండారు రామారావు (నాటక సమాజ నిర్వాహకులు)

కళా, సాహిత్య రంగ ప్రముఖులు: భానుమతి రామకృష్ణ (బహుముఖ ప్రజ్ఞాశాలి, నటి), గరికపాటి వరలక్ష్మి (నటి, గాయని), టి. కృష్ణ (విప్లవ దర్శకులు), షేక్ చినమౌలానా (నాదస్వర విద్వాంసులు), నీలంరాజు వెంకట శేషయ్య (పాత్రికేయులు, సాహితీవేత్త), ధారా రామనాథ శాస్త్రి (నాట్యావధాని), నాగభైరవ కోటేశ్వరరావు (కవి, రచయిత), కలేకూరి ప్రసాద్ (దళిత కవి, రచయిత), పైడి తెరేష్ బాబు (దళిత సాహితీవేత్త, కళాకారులు), మల్లవరపు జాన్ (కవి, రచయిత).
Advertisement
Nara Lokesh
Ongole
Statue Unveiling
Ongole Gitta
Andhra Pradesh Politics
Great Personalities

More Telugu News