20 వేల మంది జెన్జీ యువతతో మాటామంతి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటన
- దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో యువత పాత్ర కీలకమన్న కోటంరెడ్డి
- యువతతో 51 ప్రాంతాల్లో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడి
- చంద్రబాబు ఐటీ సంస్కరణలతో యువతకు విస్తృతంగా ఉద్యోగాలు లభిస్తున్నాయని కితాబు
స్వామి వివేకానంద, శ్రీశ్రీ చెప్పినట్లుగా దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్ర అత్యంత కీలకమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేటి యువత దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ, హోదాలతో సంబంధం లేకుండా నాయకులను ప్రశ్నిస్తోందని, ఇది మంచి పరిణామమని ఆయన స్వాగతించారు.
20 వేల మంది జెన్జీ యువత భాగస్వామ్యంతో 55 రోజుల పాటు 51 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ‘మాటామంతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దేశ, రాష్ట్ర పురోగతికి తీసుకుంటున్న చర్యలపై ఈ వేదికగా చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి మంత్రి నారా లోకేశ్ పడుతున్న శ్రమను, కూటమి ప్రభుత్వం నెరవేర్చిన ఉద్యోగాల హామీని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనతో తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల వల్లే నేడు యువతకు ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయని చెప్పారు. బహిరంగంగా మాట్లాడలేని యువత కోసం ప్రత్యేక ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీని అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.