నారా లోకేశ్.. విద్యార్థుల్లో విద్యార్థిగా.. టీచర్లలో టీచర్ గా..! ఫొటోలు ఇవిగో!

Nara Lokesh interacts with students and teachers as one among them
  • విద్యావ్యవస్థలోని సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి లోకేశ్ వినూత్న ప్రయత్నం
  • విద్యార్థులతో విద్యార్థిలా, ఉపాధ్యాయులతో ఉపాధ్యాయుడిలా మమేకం
  • విశాఖలో ఆధునికీకరించిన పాఠశాలను ప్రారంభించి, విద్యార్థులతో సరదాగా ముచ్చట
  • విజయనగరంలో ఉపాధ్యాయులతో కలిసి కెమిస్ట్రీ క్లాస్‌లో కూర్చున్న వైనం
  • లోకేశ్ ఆచరణాత్మక శైలిపై విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి హర్షం
విద్యావ్యవస్థలో క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనుసరిస్తున్న వినూత్న పంథా అందరినీ ఆకట్టుకుంటోంది. సంప్రదాయ పర్యటనలకు భిన్నంగా, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఆయన నేరుగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మమేకమవుతున్నారు. వారిలో ఒకరిగా కలిసిపోయి, సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కారాలకు చొరవ చూపుతున్నారు. "ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్" రూపకల్పనే లక్ష్యంగా ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం విద్యావర్గాల్లో కొత్త ఆశలు రేపుతోంది.

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివీస్ సంస్థ సహకారంతో ఆధునీకరించిన భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. గతంలో తాను ఈ పాఠశాలను సందర్శించినప్పుడు క్రీడా మైదానం మోకాలి లోతు నీటిలో ఉండటాన్ని గమనించారు. విద్యార్థుల ఇబ్బందులను అర్థం చేసుకుని, దివీస్ యాజమాన్యంతో మాట్లాడి అత్యాధునిక సౌకర్యాలతో పాఠశాలను అభివృద్ధి చేసేలా ఒప్పించారు. నేడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారిన తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆధునాతన ప్లేగ్రౌండ్‌ను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ప్రసంగాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు మైక్ అందించి వారి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకున్నారు. వారు అడిగిన సరదా ప్రశ్నలకు అంతే ఉత్సాహంగా సమాధానాలిచ్చి వారిలో ఒకరిగా కలిసిపోయారు.

అనంతరం విజయనగరం పర్యటనలోనూ లోకేశ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. దాసన్నపేట బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న స్కూల్ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అక్కడ ఉపాధ్యాయులకు కెమిస్ట్రీపై పునశ్చరణ తరగతులు జరుగుతుండగా, వారికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా నిశ్శబ్దంగా వెళ్లి ఉపాధ్యాయుల మధ్య కూర్చున్నారు. శ్రద్ధగా పాఠం వింటూనే, విరామ సమయంలో వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన అంశాలపై తక్షణమే ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కార మార్గాలను అన్వేషించారు.

మంత్రి హోదాను పక్కనపెట్టి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు లోకేశ్ అనుసరిస్తున్న ఈ ఆచరణాత్మక విధానంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమస్యల పరిష్కారం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Nara Lokesh
AP Education Minister
Andhra Pradesh School Reforms
Visakhapatnam Education Tour
AP Model of Education
Vizianagaram School Visit

More Telugu News