రూ.20 లంచం కేసు.. 30 ఏళ్ల తర్వాత ఇద్దరు ఉద్యోగులకు సుప్రీం ఊరట

Supreme Court relief for two employees after 30 years in 20 rupee bribe case
  • గుజరాత్‌కు చెందిన క్లర్క్, ప్యూన్‌పై నమోదైన కేసు ఇది
  • లంచం డిమాండ్ చేసినట్టు రుజువులు లేవని సుప్రీంకోర్టు స్పష్టీకరణ
  • డబ్బు రికవరీ అయినంత మాత్రాన లంచంగా భావించలేమని తీర్పు
  • ట్రయల్ కోర్టు, హైకోర్టు తీర్పులను పక్కనపెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
కేవలం రూ. 20 లంచం ఆరోపణలతో మూడు దశాబ్దాలు పాటు సాగిన సుదీర్ఘ న్యాయపోరాటానికి సర్వోన్నత న్యాయస్థానం తెరదించింది. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు, హైకోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ వారికి పూర్తి ఊరట కల్పించింది.

కేసు నేపథ్యం పరిశీలిస్తే, 1996 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా బెచారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యాపరమైన రాయితీల నిమిత్తం ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్ సర్టిఫికెట్) కోసం ఒక విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అక్కడి క్లర్క్ రూ. 120 (తనకు రూ. 100, ప్యూన్‌కు రూ. 20) లంచం డిమాండ్ చేశాడని సదరు విద్యార్థి అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రంగు పూసిన నోట్లతో ఉచ్చు పన్నారు. సర్టిఫికెట్ అందుకున్న అనంతరం విద్యార్థి, ప్యూన్‌కు రూ. 20 ఇచ్చాడు. ఆ నగదును అధికారులు ప్యూన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే, క్లర్క్ డిమాండ్ చేశాడన్న రూ. 100 మాత్రం ఎక్కడా లభించలేదు.

జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్‌కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేవలం నగదు రికవరీ అయినంత మాత్రాన లంచం తీసుకున్నట్లు నిర్ధారించలేమని, లంచం 'డిమాండ్' చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండాలని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఫిర్యాదుదారుడైన విద్యార్థి వాంగ్మూలంలో పలు వైరుధ్యాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. ప్యూన్ తనను ఎప్పుడూ డబ్బు అడగలేదని విద్యార్థి క్రాస్ ఎగ్జామినేషన్‌లో అంగీకరించిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. పని పూర్తయిన తర్వాత డబ్బు ఇవ్వడం, "మరుసటి రోజు పండుగ కావడంతో విద్యార్థి తనకు ఆ నగదు ఇచ్చాడన్న" ప్యూన్ వాదన సహేతుకంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే క్లర్క్‌పై కేసు నమోదుకు ఉన్నతాధికారి ఇచ్చిన అనుమతి కూడా చెల్లదని పేర్కొంది. ఈ కారణాలతో దిగువ కోర్టుల తీర్పులను కొట్టివేస్తూ, 30 ఏళ్ల సుదీర్ఘ కేసుకు ముగింపు పలికింది.
Advertisement
Supreme Court
Gujarat bribery case
Corruption acquittal
20 rupee bribe
Government employees

More Telugu News