నీట్, రామ మందిర విరాళాలపై దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

Congress calls for nationwide protests over NEET and Ram Mandir donations
  • లోక్‌సభ సీట్ల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసిన కాంగ్రెస్
  • ప్రస్తుత 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్
  • 800 పట్టణాలకు విస్తరించనున్న రాహుల్ గాంధీ 'ఛాత్రోం కీ గూంజ్'
కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం, రామ మందిర విరాళాల్లో చోటుచేసుకున్నాయన్న అవకతవకల ఆరోపణలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యవర్గ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానించింది. పార్లమెంటులో నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం విపక్షాల ఐక్యతకు నిదర్శనమని, దీనిని తమ విజయంగా భావిస్తున్నట్లు పార్టీ పేర్కొంది.

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను కాంగ్రెస్ మరోసారి తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలనే యథాతథంగా కొనసాగించాలని, మహిళా రిజర్వేషన్లను కూడా ఈ స్థానాల్లోనే అమలు చేయాలని స్పష్టం చేసింది. నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని ఈ సందర్భంగా తేల్చిచెప్పింది.

ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులు, యువత లక్ష్యంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న 'ఛాత్రోం కీ గూంజ్' కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 800 నగరాలు, పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించారు. వీటిలో పలు కీలక సమావేశాల్లో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొననున్నారు. 

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చొరబాట్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సీడబ్ల్యూసీ డిమాండ్ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం పలు రంగాల్లో విఫలమైందని విమర్శించింది. సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ మీడియాకు వివరించారు.
Advertisement
Indian National Congress
NEET paper leak protest
Ram Mandir donation allegations
Rahul Gandhi Chatron Ki Goonj
Lok Sabha seat delimitation

More Telugu News