మీడియాతో మాట్లాడకుండా ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన నిధి అగర్వాల్
- ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసు
- నిధి అగర్వాల్ను సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ
- నగదు లావాదేవీలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు సమాచారం
ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కథానాయిక నిధి అగర్వాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారుల ఎదుట హాజరైన ఆమెను ఈడీ బృందం సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. ప్రధానంగా 'జీత్ విన్' (JeetWin) లాంటి గేమింగ్ యాప్ల ప్రచారంలో ఆమె భాగస్వామ్యంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ ఒప్పందాలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు... ప్రమోషన్స్ కోసం ఆమె అందుకున్న భారీ పారితోషికం వివరాలు, ఆ నగదు హవాలా మార్గంలో వచ్చిందా లేక బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా చెల్లించారా అనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు సమాచారం.
దేశంలో వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్కు పాల్పడుతూ, అక్రమంగా విదేశాలకు నిధులు తరలిస్తున్న బెట్టింగ్ నెట్వర్క్లపై ఈడీ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వరుసగా నోటీసులు ఇస్తూ విచారిస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన నిధి అగర్వాల్ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టినప్పటికీ, ఆమె ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా తన కారులో వెళ్లిపోయారు.