వెలిగొండ నిర్వాసితులకు సీఎం చంద్రబాబు భరోసా.. మరో రూ.200 కోట్ల పరిహారం విడుదల

CM assurance to Veligonda evacuees another 200 crore compensation released
  • వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మరో రూ.200 కోట్ల పరిహారం
  • బాధితులకు శాసనసభ ప్రాంగణంలో చెక్కు అందించిన సీఎం చంద్రబాబు
  • ఇప్పటివరకు నిర్వాసిత కుటుంబాలకు మొత్తం రూ.518 కోట్లు చెల్లింపు
  • త్యాగాలు చేసిన నిర్వాసితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ
  • ఏడు పునరావాస కాలనీల్లో వేగంగా మౌలిక వసతుల కల్పన
దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభానికి సమీపిస్తున్న వేళ, ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా పరిహారం అందించిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.200 కోట్ల రూపాయల పరిహారాన్ని విడుదల చేసింది. ఈరోజు శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా నిర్వాసిత కుటుంబాల ప్రతినిధులకు ఈ చెక్కును అందజేశారు. ఈ విడుదలతో కలిపి ఇప్పటివరకు వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం రూ.518 కోట్ల మేర పరిహారం అందించినట్లయింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులు, నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం ఎన్నటికీ మరవదని స్పష్టం చేశారు. "త్యాగం మీది, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మాది. వెలిగొండ నిర్వాసితులను గతంలో ఆదుకున్నది మా ప్రభుత్వమే, ఇప్పుడు కూడా అండగా నిలుస్తున్నాం. మిగిలిన పరిహారాన్ని కూడా వీలైనంత త్వరగా విడుదల చేస్తాం. మంచి చేసే ప్రభుత్వాలను ప్రజలు గుర్తించాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అండగా నిలిచి, తమకు భరోసా కల్పించడం పట్ల నిర్వాసిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారు తెలిపారు.

రూ.518 కోట్లకు చేరిన పరిహారం
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగా, సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద పరిహారం చెల్లిస్తున్నారు. గతంలో 2,557 కుటుంబాలకు ఓటీఎస్ కింద రూ.318 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. తాజాగా మరో 1,600 కుటుంబాలకు రూ.200 కోట్లను అందించింది. దీంతో మొత్తం 4,157 నిర్వాసిత కుటుంబాలకు రూ.518 కోట్ల పరిహారం అందింది.

పరిహారంతో పాటు పునరావాసంపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్వాసితుల కోసం మొత్తం 7 పునరావాస కాలనీలను అభివృద్ధి చేస్తుండగా, ఇప్పటికే వేములకోట మినహా మిగిలిన 6 కాలనీలలో మౌలిక సదుపాయాల పనులు పూర్తయ్యాయి. విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి అన్ని వసతులు కల్పించడంతో నిర్వాసిత కుటుంబాలు తమకు కేటాయించిన ఇళ్లకు తరలివెళ్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Nara Chandrababu Naidu
Veligonda Project compensation
Andhra Pradesh government news
Veligonda evacuees rehabilitation
Prakasam district development
CM Chandrababu Naidu funds release

More Telugu News