ఒక పార్టీ మొత్తం అసెంబ్లీని బహిష్కరించడం నా రాజకీయ జీవితంలో చూడలేదు: చంద్రబాబు
- ప్రజాసమస్యలపై అసెంబ్లీ వేదికగా చర్చిస్తేనే విలువ ఉంటుందన్న చంద్రబాబు
- వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడం వింతగా ఉందని వ్యాఖ్య
- జగన్ కు రాజకీయాలు అవసరమా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందన్న సీఎం
శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిన వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడిన సీఎం... ఒక పార్టీ మొత్తం అసెంబ్లీని బహిష్కరించడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలోనే ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే జగన్ అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నారని, డీఎస్సీ అంశంపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో కోత పెట్టిన బీసీ రిజర్వేషన్లను తమ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించిందని, ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు స్వాగతిస్తుంటే జగన్ ఇంకా బురదజల్లడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.