ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం చంద్రబాబు.. అసెంబ్లీలో సందడి

Chandrababu Naidu turns photographer and creates buzz in Assembly
  • ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం
  • అసెంబ్లీ ప్రాంగణంలో ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • వారి కెమెరాతోనే ఫొటోలు తీసి క్లిక్ అనిపించిన సీఎం
  • 'ఎక్స్' ఖాతాలో ఫొటోలు పోస్ట్ చేసి ప్రత్యేక సందేశం
  • చరిత్రను భద్రపరిచేది ఫొటోగ్రాఫర్లేనని కొనియాడిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం కొద్దిసేపు ఫొటోగ్రాఫర్‌గా మారిపోయారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో ఫొటోగ్రాఫర్లతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ల కెమెరాను చేతిలోకి తీసుకుని, వారినే క్లిక్ అనిపించారు.

వివరాల్లోకి వెళితే.. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో తనను కలిసిన మీడియా ఫొటోగ్రాఫర్లకు చంద్రబాబు తొలుత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిలో ఒకరి కెమెరాను తీసుకుని వారికి ఫొటోలు తీశారు. తాను తీసిన ఫొటోలను తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు 'ఎక్స్' వేదికగా ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. "చరిత్రను నమోదు చేసే, జ్ఞాపకాలను భద్రపరిచే ఫొటోగ్రాఫర్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మన మీడియా, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను కలవడం గౌరవంగా భావిస్తున్నాను. వారి అంకితభావం, కళానైపుణ్యం, అవిశ్రాంత కృషి మనందరికీ కొత్త దృక్కోణాలను అందిస్తాయి. ప్రతి చిత్రం రాబోయే తరాల కోసం కాలంలోని ఒక భాగాన్ని భద్రపరుస్తుంది. స్ఫూర్తినిచ్చే క్షణాలను బంధిస్తూ ఫొటోగ్రఫీ కమ్యూనిటీ ముందుకు సాగాలి" అంటూ చంద్రబాబు తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
Advertisement
Chandrababu Naidu
World Photography Day
AP Assembly
CM turns photographer
Media photographers
Andhra Pradesh News

More Telugu News