విశాఖ డేటా సెంటర్లపై అవ‌న్నీ అపోహలే.. తాగునీటికి ఇబ్బంది ఉండదు: మంత్రి లోకేశ్‌

Nara Lokesh clarifies myths on Visakhapatnam data centers and water supply
  • విశాఖ డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేస్తున్నారన్న‌ మంత్రి 
  • డేటా సెంటర్లకు పోలవరం పారిశ్రామిక వాటా నుంచి నీటిని కేటాయిస్తామని స్పష్టత
  • థర్మల్ పవర్ ప్లాంట్‌తో పోలిస్తే డేటా సెంటర్ల నీటి వినియోగం చాలా తక్కువని వివరణ
  • నీటి వనరులపై ప్రభావం చూపుతాయని పౌర సంఘాలు, విపక్షాల ఆందోళన
విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల పర్యావరణ ప్రభావం, నీటి అవసరాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. నేడు రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. డేటా సెంటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం తరఫున గట్టిగా సమర్థించారు.

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి డేటా సెంటర్లు అత్యంత కీలకమని అన్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకు రావడంతో ఇతర ఐటీ కంపెనీల నుంచి కూడా నగరానికి విస్తృతమైన ఆసక్తి వ్యక్తమవుతోందని తెలిపారు.

ప్రతిపాదిత డేటా సెంటర్ల వ్యవస్థ పూర్తిస్థాయిలో 6.5 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నాక, ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏటా సుమారు 3 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని అంచనా వేశామని లోకేశ్‌ వివరించారు. భవిష్యత్తులో రానున్న అధునాతన కూలింగ్ టెక్నాలజీల వల్ల నీటి వినియోగం మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన వాటా నుంచే సరఫరా చేస్తామని, నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న 18 నెలల్లో గ్రావిటీ ఆధారంగా విశాఖ నగరానికి పోలవరం నీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

నీటి వినియోగంపై పోలిక చెబుతూ.. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక డేటా సెంటర్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుందని లోకేశ్‌ పేర్కొన్నారు. కేవలం డేటా సెంటర్లపైనే నీటి వినియోగం గురించి నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డేటా సెంటర్ల కేటాయింపులకు 6.5 గిగావాట్ల పరిమితిని స్పష్టంగా నిర్దేశించారని, ఆ లక్ష్యం ఇప్పటికే పూర్తయిందని ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చే కంపెనీలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అడవివరం-ముదసర్లోవ, తర్లువాడ, రాంబిల్లి ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్లు రానున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టుల వల్ల నీరు, విద్యుత్ వంటి వనరులపై తీవ్రమైన భారం పడుతుందని, పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని విశాఖలోని పౌర సంఘాలు, సీపీఐ, సీపీఎం వంటి వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
Nara Lokesh
Visakhapatnam Data Centers
Google Investment Vizag
Polavaram Project Water
Andhra Pradesh IT Department
Data Center Cooling Technology

More Telugu News