రాహుల్ గాంధీ ఆస్తుల కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ప్రశ్న.. లక్నో హైకోర్టు ఉత్తర్వులపై స్టే!
- రాహుల్ గాంధీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
- కేసులోని ఆరోపణలు అంత తీవ్రమైనవైతే సీబీఐ, ఈడీ ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నాయన్న సుప్రీంకోర్టు
- కోర్టుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఎందుకు వేచి చూశాయని ప్రశ్న
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ), కేంద్ర ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశిస్తూ లక్నో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
విచారణ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు స్పందిస్తూ... ఈ కేసులోని ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఇది ఆదాయానికి మించిన ఆస్తుల కిందకు వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... "ఆరోపణలు అంత తీవ్రమైనవే అయితే మీ దర్యాప్తు సంస్థలు ఇన్నాళ్లూ ఎందుకు ఊరుకున్నాయి? దర్యాప్తు లేదా విచారణ ప్రారంభించడానికి కోర్టుల నుంచి ఒత్తిడి లేదా ఆదేశాలు వచ్చే వరకు ఎందుకు వేచి చూశాయి? చట్టప్రకారం మీకున్న స్వయంప్రతిపత్తి అధికారాలతో సొంతంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు?" అని ప్రశ్నించింది.