జీపీఎస్‌ ఆఫ్‌ ఉన్నా సరే.. మీ ఫొటోతో లొకేషన్‌ పసిగట్టేస్తున్న ఏఐ!

AI identifies your location from photos even when GPS is off
  • సోషల్‌ మీడియా ఫొటోలతో లొకేషన్‌ గుర్తించే ఏఐ
  • మెకాఫీ అధ్యయనంలో 91 శాతం వరకు కచ్చితత్వం
  • జీపీఎస్‌, లొకేషన్‌ ట్యాగ్‌ లేకున్నా గుర్తింపు సాధ్యం
  • భవనాలు, బోర్డులు, రోడ్లతో ఏఐ అంచనా
  • ట్రావెల్‌ ఫొటోలు స్కామర్లకు ఉపయోగపడే ప్రమాదం
సోషల్‌ మీడియాలో ఫొటోలు, రీల్స్‌ పెట్టడం ఇప్పుడు సాధారణమైపోయింది. విహారయాత్రకు వెళ్లినా, కొత్త ప్రదేశంలో దిగినా వెంటనే ఆ ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్‌ చేస్తుంటాం. అయితే ఇకపై ఫొటోతో పాటు మీ లొకేషన్‌ కూడా బయటపడే ప్రమాదం ఉంది. ఫొటోలో జీపీఎస్‌ సమాచారం, లొకేషన్‌ ట్యాగ్‌, క్యాప్షన్‌ లేకపోయినా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అది ఎక్కడ తీసిందో గుర్తించే అవకాశం ఉందని మెకాఫీ అధ్యయనం వెల్లడించింది.

21,236 ట్రావెల్‌ ఫొటోలను పరిశీలించిన మెకాఫీ.. గూగుల్‌కు చెందిన గెమ్మా 3 27B, అలీబాబా క్వెన్‌ 3 వీఎల్‌ 30బీ మోడళ్లను పరీక్షించింది. గెమ్మా మోడల్‌ 87 శాతం ఫొటోలకు నగరం, దేశాన్ని సరిగ్గా గుర్తించింది. క్వెన్‌ 3 ఏకంగా 91 శాతం కచ్చితత్వం సాధించింది. ఫొటోలో కనిపించే భవనాలు, రోడ్డు గుర్తులు, దుకాణాల బోర్డులు, ఆకాశహర్మ్యాలు, వెలుతురు, ఆహార దుకాణాల వంటి చిన్నచిన్న వివరాలను ఏఐ పరిశీలించి లొకేషన్‌ను అంచనా వేసింది.

ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఫొటోలను ఏఐ సులభంగా గుర్తించింది. సాధారణ బీచ్‌లు, గ్రామీణ రోడ్లు, హోటల్‌ గదుల విషయంలో కచ్చితత్వం కొంత తగ్గింది. అయినా చాలా సందర్భాల్లో కనీసం దేశాన్ని గుర్తించగలిగింది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ పోస్ట్‌ చేయని వ్యక్తిగత ఫొటోలను ఏఐ టూల్స్‌లో పెట్టినా అవి ఎక్కడ తీసినవో గుర్తించిన ఉదాహరణలు ఉన్నాయని అధ్యయనం తెలిపింది.

ఇలాంటి టెక్నాలజీ సైబర్‌ నేరగాళ్లకు ఉపయోగపడే ప్రమాదం ఉందని మెకాఫీ హెచ్చరించింది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లో కనిపించే ప్రయాణ ఫొటోలను ఏఐతో విశ్లేషించి.. వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు. ఆ సమాచారంతో బ్యాంకు మోసం లేదా నకిలీ లాగిన్‌ హెచ్చరికల పేరుతో మరింత నమ్మదగిన మెసేజ్‌లు పంపే అవకాశం ఉంటుంది. 2025లో దేశంలో 28.15 లక్షల సైబర్‌ నేరాలు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ప్రజలు రూ.22,495 కోట్లు నష్టపోయారు.
Advertisement
Artificial Intelligence
McAfee Study
Cyber Security
Google Gemma
Alibaba Qwen
Photo Privacy

More Telugu News