సినీ నటి అనసూయపై బోరబండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
- సనాతన ధర్మం, జై శ్రీరాం నినాదాలపై అనసూయ వివాదాస్పద వ్యాఖ్యలు
- బోరబండ పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతల ఫిర్యాదు
- తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న అనసూయ
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఊహించని షాక్ తగిలింది. ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపాయి. సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అసాంఘిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై బీజేపీ నాయకులు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులో అనసూయ వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్న కాషాయ పార్టీ నేతలు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆమెపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే తనపై కేసు నమోదు కావడంపై అనసూయ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఏమాత్రం తగ్గేదేలేదని స్పష్టం చేసిన అనసూయ, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కేవలం నినాదాలు చేయడం మాత్రమే కాకుండా మనుషుల ప్రవర్తన, నైతికత ముఖ్యమని చెప్పడమే తన ఉద్దేశమని వెల్లడించారు. తాను ఎల్లప్పుడూ సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తినని, రాముడిని, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తానని పేర్కొంటూనే, తన వ్యాఖ్యల వల్ల అసలైన దొంగలంతా బయటకు వస్తున్నారంటూ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.