ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గైర్హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు

AP Assembly Sessions Begin
  • సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను చేపట్టిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
  • అమరావతి నిర్మాణ పనులపై వివరాలను వెల్లడించిన మంత్రి నారాయణ
  • 30,173 మంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ కేటాయించామని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి సభకు చేరుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో సాగుతున్న నిర్మాణ పనులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సభలో కీలక వివరాలు వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో మొత్తం 119 పనులను ప్రతిపాదించగా, 103 పనులకు 'ల్యాండ్ ఆఫ్ ఇంటెంట్' జారీ చేశామని, ప్రస్తుతం 97 పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డ్‌ల ద్వారా రూ. 41,187.7 కోట్లు టై-అప్ కాగా... ఇప్పటివరకు రూ. 12,737.13 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన 30,173 మంది రైతులకు 71,293 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించామని, కౌలు కింద రైతులకు రూ. 2,248.03 కోట్లు చెల్లించామని వివరించారు.


శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సింహచలంలో జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల ఏర్పాటు, యనమదుర్రు డ్రెయిన్ ఆధునికీకరణ, మౌలిక వసతులు, నిర్మాణ కార్మికుల సంక్షేమంపై మంత్రులు వివరాలు అందించారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం స్పీకర్ నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశమై ఈ వర్షాకాల సమావేశాల పనిదినాలు, షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. 


మరోవైపు శాసనమండలి సమావేశాలు కూడా ఉదయం ప్రారంభమయ్యాయి. మండలి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని... దీనిపై సీబీఐ చేత విచారణ చేయించాలని వైసీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది.

Advertisement
YS Jagan Mohan Reddy
AP Assembly Sessions
Amaravati Development
Minister Narayana
YSRCP Boycott
Andhra Pradesh Politics

More Telugu News