అల్లు అరవింద్ కామెంట్స్ పై యశ్ స్పందన
- కేజీఎఫ్ కంటే ముందు యశ్ ఎంత మందికి తెలుసని గతంలో ప్రశ్నించిన అల్లు అరవింద్
- భారీ నిర్మాణ విలువలే ఆ సినిమా పెద్ద హిట్ కావడానికి కారణమని వ్యాఖ్య
- అందరి కష్టం తోడైతేనే మంచి అవుట్పుట్ వస్తుందన్న యశ్
‘కేజీఎఫ్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్... ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘టాక్సిక్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, గతంలో అల్లు అరవింద్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఒక ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా స్పందించారు. కేజీఎఫ్ చిత్రం తన కెరీర్ను మలుపు తిప్పిందనే విషయాన్ని ఒప్పుకుంటూనే, ఒక సినిమా విజయం, దానికి వచ్చే గుర్తింపుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఒక సినిమా వల్ల నిర్మాత కంటే హీరోకే ఎక్కువ గుర్తింపు వస్తుందనే అంశంపై యశ్ మాట్లాడుతూ... విజయం అనేది కేవలం నిర్మాతకు లేదా ఒక్క వ్యక్తికి మాత్రమే సొంతం కాదని స్పష్టం చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి రచయితల వరకు అందరి కష్టం తోడైతేనే మంచి అవుట్పుట్ వస్తుందని, ప్రధాన పాత్రలో నటించేవారు సరిగ్గా చేయలేకపోతే సినిమా కచ్చితంగా విజయం సాధించదని తెలిపారు. ప్రేక్షకుల నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదని, ఎవరి శ్రమకు తగిన గౌరవం వారికి ఇవ్వడంలో ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఎంతటి స్టార్ హీరో తలరాతనైనా శుక్రవారం విడుదలయ్యే ఆ ఒక్క రోజే నిర్ణయిస్తుందని, సినిమా ఆడకపోతే 'పాన్-ఇండియా' ట్యాగ్ కూడా మాయమైపోతుందని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, 2023లో ఓ సినిమా వేడుకలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ "కేజీఎఫ్ కంటే ముందు యశ్ ఎంతమందికి తెలుసు?" అని ప్రశ్నిస్తూ, భారీ నిర్మాణ విలువలే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఈ కామెంట్స్ పై యశ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా యశ్ స్పందిస్తూ.. ఇతరుల వ్యాఖ్యలు లేదా కామెంట్లు తన వ్యక్తిత్వాన్ని ఏమాత్రం మార్చలేవని తేల్చి చెప్పారు.