ట్వీట్లతోనో, స్పీచ్ లతోనే ఆక్రమించలేరు.. హర్మూజ్ జలసంధి ఇరాన్దే: ట్రంప్ ప్రకటనపై ఇరాన్ కౌంటర్
- హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానన్న ట్రంప్
- ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఇరాన్ మంత్రి కాజెమ్ గరీబాబాడీ
- హర్మూజ్ పై పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్య
అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్ధం ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. ఇరాన్తో జరుగుతున్న పోరులో విజయం సాధించిన అనంతరం హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ శాఖ అత్యంత ఘాటుగా స్పందించింది.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడిన ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబాడీ, ఒక సోషల్ మీడియా ట్వీట్ ద్వారానో, యుద్దనౌకలతో బెదిరించడం ద్వారానో లేదా ఎన్నికల ఉపన్యాసాలతోనో హర్మూజ్ జలసంధిని ఎవరూ ఆక్రమించలేరని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి ఇరాన్దేనని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్ విధించిన షరతులను అంగీకరించే వరకు జలసంధిని మూసివేయడం లేదా తెరవడం పూర్తిగా ఇరాన్ కమాండ్ నియంత్రణలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతానికి పైగా జరిగే ఈ వ్యూహాత్మక మార్గంలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది.