స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అస్వస్థత
- తిరుపతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆనం
- ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన మంత్రి
- వెంటనే ప్రాథమిక చికిత్స అందించిన వైద్య బృందం
- బీపీ లెవెల్స్ పడిపోయాయని వెల్లడించిన వైద్యులు
- కాసేపట్లో కోలుకున్న మంత్రి ఆనం
తిరుపతిలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి సుదీర్ఘంగా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన స్పృహ తప్పారు. ఈ క్రమంలో ఆయన పక్కకు వాలిపోతుండగా, వేదికపై ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులు వెంటనే అప్రమత్తమై ఆయనను కింద పడకుండా పట్టుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న వైద్య బృందం వెంటనే ప్రాథమిక చికిత్స అందించి, రక్తపోటు (బీపీ) తగ్గడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. సకాలంలో వైద్య సేవలు అందించడంతో ఆయన కోలుకున్నారు. కాసేపటి విశ్రాంతి తర్వాత మంత్రి ఆనం తిరిగి వేడుకలలో పాల్గొనగా, ఆయన మిగిలిన ప్రసంగాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు చదివి వినిపించారు.