ఖర్గేకు అవమానం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు షర్మిల పిలుపు

YS Sharmila calls for statewide protests over insult to Mallikarjun Kharge
  • ఖర్గే పర్యటించిన స్థలాన్ని శుద్ధి చేయడంపై షర్మిల తీవ్ర ఆగ్రహం
  • ఇది దళితుల వ్యక్తిత్వానికి జరిగిన అవమానమంటూ విమర్శ
  • బీజేపీ కుల వివక్షకు, విభజన రాజకీయాలకు నిదర్శనమని ఆరోపణ
  • ఆగస్టు 14న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, సత్యాగ్రహానికి పిలుపు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అవమానం జరిగిందంటూ, బీజేపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో ఖర్గే పాల్గొన్న సభా ప్రాంగణాన్ని బీజేపీ, హిందుత్వ సంస్థలు గంగాజలంతో శుద్ధి చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ కుల దురహంకారానికి, దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆరోపిస్తూ రేపు (ఆగస్టు 14) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.

ఈ ఘటనపై షర్మిల తీవ్రంగా స్పందించారు. "బీజేపీ చేసిన హవనం.. దళితుల వ్యక్తిత్వానికి జరిగిన హననం" అని ఆమె అభివర్ణించారు. దళితుల పట్ల వివక్ష చూపడమే బీజేపీ సిద్ధాంతమని, కులమతాల మధ్య విభేదాలు సృష్టించడం ఆ పార్టీ మనస్తత్వమని విమర్శించారు. రామ్ లీలా మైదానంలో ఖర్గే అడుగుపెట్టిన స్థలాన్ని శుద్ధి చేయడం బీజేపీ పాటిస్తున్న అంటరానితనానికి, అసమానతలకు అద్దం పడుతుందని ఆమె మండిపడ్డారు. ఇది సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన చర్య అని, రాజ్యాంగ విలువలను తునాతునకలు చేసే ఈ రాక్షస చర్యను యావత్ దేశం ఖండిస్తోందని తెలిపారు.

ఈ సిగ్గుమాలిన చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉద్యమిస్తోందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు షర్మిల ప్రకటించారు. ఆగస్టు 14వ తేదీ సాయంత్రం ప్రతి జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఆధ్వర్యంలో భారీ మార్చ్, సత్యాగ్రహం నిర్వహించాలని ఆమె పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ మార్చ్‌ను స్థానిక అంబేడ్కర్ లేదా గాంధీ విగ్రహాల వద్ద ముగించి, ఖర్గేకు సంఘీభావంగా సత్యాగ్రహం చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో డీసీసీ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు, పార్టీ అనుబంధ విభాగాలు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని షర్మిల కోరారు. ఇటువంటి వివక్ష, విభజన కుట్రలను దేశ ప్రజలు సహించబోరని బీజేపీకి శక్తివంతమైన సందేశం పంపాలని ఆమె పిలుపునిచ్చారు.
Advertisement
YS Sharmila
Mallikarjun Kharge
AP Congress Protests
BJP Anti Dalit Policies
Congress Satyagraha Andhra Pradesh
Dalit Rights Controversy

More Telugu News