నేరాల రూపం మారింది.. పోలీసింగ్ మారాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says nature of crime changed and policing must evolve
  • పోలీసులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • నేర దర్యాప్తులో 'గోల్డెన్ అవర్' కీలకమని, ఆధారాల పరిరక్షణలో విఫలం కావొద్దని సూచన
  • రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశం
  • ఇక నుంచి ప్రతీ నెలా పోలీసుల పనితీరుపై పెర్ఫార్మెన్స్ రిపోర్టు విడుదల
  • పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, గౌరవం పెంచేలా చర్యలు తీసుకుంటామని హామీ
మారుతున్న కాలంతో పాటు నేరాల స్వరూపం, స్వభావం పూర్తిగా మారిపోయాయని, అందుకు అనుగుణంగా పోలీసింగ్ విధానాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరం జరిగిన వెంటనే తొలి గంట (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని, ఆ సమయంలో కీలక ఆధారాలు చేజారిపోకుండా చూడటమే నేర నియంత్రణలో మొదటి విజయమని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. 

బుధవారం నాడు సచివాలయం నుంచి రాష్ట్ర డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) వరకు సుమారు 1,650 మంది అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ నుంచి ఎస్‌హెచ్‌ఓ స్థాయి వరకు ఒకేసారి ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి దేశవ్యాప్తంగా మార్మోగాలని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, గౌరవం

ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా శాంతిభద్రతలు అత్యంత కీలకమని చంద్రబాబు అన్నారు. "రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు విభాగం ఒక గర్వకారణం. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా మీరంతా వ్యవహరించాలి. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలి" అని ఆయన సూచించారు. 

2019-24 మధ్య పాలకులు గంజాయి, కల్తీ మద్యాన్ని రాష్ట్రానికి పెను సమస్యగా మార్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని, వారి గౌరవం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 14,770 ప్రభుత్వ సీసీ కెమెరాలతో పాటు, ప్రైవేటు వ్యక్తుల కెమెరాలను కలిపి మొత్తం లక్ష కెమెరాలను నేర నియంత్రణ కోసం అనుసంధానించామని తెలిపారు. ఫేస్ రికగ్నిషన్, డీఎన్‌ఏ డిటెక్షన్ వంటి ఆధునిక టెక్నాలజీతో నేరాలను వేగంగా ఛేదిస్తున్నామని అన్నారు.

వివేకా కేసులో అది కాస్ట్ లీ మిస్టేక్‌

రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. "పరామర్శల పేరుతో రోడ్లపై విన్యాసాలు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్రహీంపట్నంలో మోటార్ సైకిల్ విన్యాసాలు, విశాఖలో మూడు గంటల పాటు రోడ్లు దిగ్బంధించడం వంటివి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయి. ప్రస్తుతం రోడ్లపై వీరంగం సృష్టిస్తున్న వారిలో 94 శాతం మంది ఒకే పార్టీకి చెందిన వారు. ఏ పార్టీకి కూడా చట్టాన్ని ఉల్లంఘించే లైసెన్స్ లేదు" అని చంద్రబాబు హెచ్చరించారు. 

వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలను చెరిపేసే ప్రయత్నం జరగడం పోలీసుల వైపు నుంచి జరిగిన అత్యంత ఖరీదైన తప్పిదం (కాస్ట్ లీ మిస్టేక్‌) అని అన్నారు. నేరం జరిగిన ప్రాంతాన్ని సంరక్షించడంలో వైఫల్యం ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో ఈ ఘటనే నిదర్శనమని, నేరస్తుల పట్ల ఉదాసీనత వద్దని స్పష్టం చేశారు.

ఇకపై నెలవారీ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్

శాంతిభద్రతల విషయంలో ఏపీని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలపాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఇకపై ప్రతీ నెలా పోలీసు శాఖ పనితీరుపై ఒక పెర్ఫార్మెన్స్ రిపోర్టును విడుదల చేయాలని ఆదేశించారు. దీని ద్వారా ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని, సక్సెస్ స్టోరీలను ప్రజలకు వివరించవచ్చని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పూర్తిస్థాయిలో అమలు కావాలని, అదే సమయంలో సంఘ విద్రోహ శక్తులకు పోలీసులంటే భయం కలగాలని సూచించారు. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం కొనసాగుతుందని, 'డ్రగ్స్ వద్దు బ్రో' వంటి ప్రచారాలతో గంజాయి, మాదకద్రవ్యాలపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ప్రమాదాల నివారణకు రోడ్ ఇంజనీరింగ్, హాట్‌స్పాట్‌ల ఆడిట్‌పై దృష్టి సారించాలని కోరారు.

ఈ సమావేశంలో హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, శాంతి భద్రతల అదనపు డీజీ ఎన్. మధుసూధన రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1200 పోలీస్ స్టేషన్ల నుంచి శాంతిభద్రతలు, ట్రాఫిక్, జీఆర్పీ సహా వివిధ విభాగాల అధికారులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Police
Law and Order
Crime Prevention
Police Reforms
Golden Hour Investigation

More Telugu News