అమెరికాలో అదానీపై కేసు కొట్టివేత.. మోదీపై రాహుల్‌ గాంధీ ఘాటు విమర్శలు

Adani case dismissed in US Rahul Gandhi sharp criticism on Modi
  • వెనక చాలా పెద్ద కథ ఉందన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్య
  • మోదీ భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపణ
  • అందుకు దేశం భారీ మూల్యం చెల్లిస్తోందని విమర్శలు
  • ఓ ప్రాజెక్ట్‌ దక్కించుకునేందుకు అధికారులకు అదానీ లంచం ఇచ్చారన్నది కేసులో ప్రధాన ఆరోపణ
అమెరికాలో అదానీకి సంబంధించిన కేసు కొట్టివేతపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. అమెరికా కోర్టు నిర్ణయం వెనక మరింత కథ ఉందని వ్యాఖ్యానించారు.

అమెరికాలో అదానీ, ఆయన బంధువు సాగర్‌ అదానీ సహా ఇతరులపై నమోదైన దాదాపు రెండేళ్ల నాటి క్రిమినల్‌ కేసును న్యూయార్క్‌లోని ఫెడరల్‌ న్యాయమూర్తి సోమవారం కొట్టివేశారు. ఈ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని అమెరికా న్యాయశాఖ కోర్టును కోరింది.

ఈ నేపథ్యంలో కేసు కొట్టివేత వార్త స్క్రీన్‌షాట్‌ను రాహుల్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేస్తూ మోదీపై విమర్శలు చేశారు. “పైకి కనిపిస్తున్నదానికంటే ఈ వ్యవహారం వెనుక ఇంకా చాలా ఉంది. ఒత్తిడికి లోనైన ప్రధాని భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అందుకు దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది” అని రాసుకొచ్చారు.

ఈ కేసులో భారత్‌లోని ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చేందుకు కుట్ర చేశారన్నది ప్రధాన ఆరోపణ. సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకునేందుకు ఈ ప్రయత్నం జరిగిందని 2024 నవంబరులో అమెరికా అధికారులు అభియోగాలు నమోదు చేశారు. అయితే అదానీ గ్రూప్‌ ఈ ఆరోపణలను అప్పట్లోనే ఖండించింది. తమ సంస్థలు, అధికారులు చట్టాలకు అనుగుణంగానే వ్యవహరించారని స్పష్టం చేసింది.

కేసును కొట్టివేయాలన్న న్యాయశాఖ నిర్ణయంపై న్యాయమూర్తి నికోలస్‌ గరాఫిస్‌ గతంలో ప్రశ్నలు లేవనెత్తారు. నిర్ణయానికి మరిన్ని వివరణలు ఇవ్వాలని కోరారు. నిందితులు అమెరికా పౌరులు కాదని, వారు ఎప్పుడూ అమెరికా కోర్టుకు హాజరు కాలేదని న్యాయశాఖ పేర్కొంది.
Advertisement
Rahul Gandhi
Gautam Adani
Narendra Modi
Adani US Case Dismissed
Adani Bribery Allegations
Congress Party

More Telugu News