సుభాష్‌ చంద్రబోస్‌ వారసుడి కొత్త రాజకీయ అడుగు.. యువత కోసం ‘ఆజాద్‌ హింద్‌ పార్టీ’!

Chandra Kumar Bose launches Azad Hind Party for youth following Netaji legacy
  • ‘ఆజాద్‌ హింద్‌ పార్టీ’ ప్రకటించిన చంద్రకుమార్‌ బోస్‌
  • యువతే పార్టీకి ప్రధాన బలమని ప్రకటన
  • జెన్‌-జీ నిరసనలే నిర్ణయానికి కారణమని వెల్లడి
  • రాజకీయ వ్యవస్థలో అవినీతిపై బోస్‌ విమర్శలు
  • ఇటీవలే టీఎంసీకి రాజీనామా చేసిన బోస్‌
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వారసత్వాన్ని మరోసారి రాజకీయ వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలైంది. ఆయన మునిమనవడు చంద్రకుమార్‌ బోస్‌ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ‘ఆజాద్‌ హింద్‌ పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతను ప్రధాన బలంగా చేసుకుని.. నేతాజీ అనుసరించిన సమ్మిళిత, లౌకిక భావజాలంతో ముందుకు సాగుతామని చెప్పారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్‌-జీ నిరసనలు తన నిర్ణయానికి ప్రధాన కారణమని చంద్రకుమార్‌ బోస్‌ తెలిపారు. నీట్‌-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై జంతర్‌ మంతర్‌ వద్ద యువత చేపట్టిన ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వాలు, వ్యవస్థలపై యువతలో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.

దేశవ్యాప్తంగా రాజకీయాలు, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు సహా పలు రంగాల్లో అవినీతి పెరిగిందని బోస్‌ ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై విసిగిపోయిన యువతకు తమ హక్కుల కోసం పోరాడేందుకు ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమని చెప్పారు. అందుకే నేతాజీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరుతో స్ఫూర్తి పొందిన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

చంద్రకుమార్‌ బోస్‌ 2016లో బీజేపీలో చేరారు. ఏడేళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగారు. నేతాజీ సిద్ధాంతాల ప్రచారం కోసం ‘ఆజాద్‌ హింద్‌ మోర్చా’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదని ఆయన చెప్పారు. బీజేపీలో చేరడం తన తప్పిదమని గతంలో వ్యాఖ్యానించారు.

2026 ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో చేరారు. నేతాజీ భావజాలంపై పనిచేసే అవకాశం ఉంటుందని భావించినట్లు తెలిపారు. అయితే నాలుగు నెలలకే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆగస్టు 3న వ్యక్తిగత కారణాలతో తప్పుకొంటున్నట్లు మమతా బెనర్జీకి లేఖ రాశారు.
Advertisement
Chandra Kumar Bose
Azad Hind Party
Netaji Subhas Chandra Bose
West Bengal Politics
New Political Party India
Azad Hind Fauj

More Telugu News