పౌర స్పృహలో తమిళనాడు టాప్.. జాతీయ సర్వేలో ఆసక్తికర విషయాలు

Tamil Nadu tops in civic sense national survey interesting facts revealed
  • గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ సర్వే 2025లో వెల్లడించిన ఇండియా టుడే గ్రూప్
  • ప్రమాద బాధితులకు సాయం చేయడంలో పశ్చిమ బెంగాల్ ముందంజ
  • పరిశుభ్రతలో కేరళ, పర్యావరణ స్పృహలో హర్యానాకు అగ్రస్థానం
  • లంచం ఇవ్వడాన్ని 75 శాతం మంది తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సర్వేలో వెల్లడి
పౌర స్పృహ, బాధ్యతాయుతమైన ప్రజా ప్రవర్తన విషయంలో దేశంలోనే తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. ఇండియా టుడే గ్రూప్, హౌ ఇండియా లివ్స్, కాడెన్స్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన "గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ సర్వే 2025"లో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 9,188 మంది నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

లంచాలను తిరస్కరించడం, ప్రమాద బాధితులకు సాయం చేసే సుముఖత, ప్రజా రవాణాలో నిబంధనలు పాటింపు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకపోవడం, పర్యావరణం పరిరక్షణ వంటి కీలక అంశాలను ప్రాతిపదికన తీసుకుని ఈ ర్యాంకులను నిర్ణయించారు. ఈ జాబితాలో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలవగా, సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది లంచం ఇవ్వడం లేదా తీసుకోవడం తప్పని గట్టిగా అభిప్రాయపడటం విశేషం.

ఈ సర్వేలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మొదటి 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాను విడుదల చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తక్షణమే సాయం అందించడంలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో నిలిచింది.

అవినీతిని వ్యతిరేకించడంలో 73 శాతంతో ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. ప్రజా రవాణాలో టికెట్ లేకుండా ప్రయాణించకపోవడం వంటి క్రమశిక్షణలో ఢిల్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. చెత్త కుండీలు అందుబాటులో లేకపోయినా, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా పౌర బాధ్యతను చాటడంలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది.

పర్యావరణ మార్పులపై అవగాహన, ఆందోళన వ్యక్తం చేయడంలో హర్యానా (78 శాతం) అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్ రెండో స్థానాన్ని పొందింది. ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారతదేశంలో పౌరుల రోజువారీ జీవనశైలి, వారి సామాజిక వైఖరులను శాస్త్రీయంగా అంచనా వేయడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం.

మొత్తంగా పౌర స్పృహ, బాధ్యతాయుత ప్రవర్తన విషయంలో మొదటి పది స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను చూస్తే, వరుసగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, కేరళ, హర్యానా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఉన్నాయి.
Advertisement
Tamil Nadu
Gross Domestic Behavior Survey 2025
Civic Sense National Survey
India Today Group Survey
Responsible Public Behavior

More Telugu News