మధ్యప్రదేశ్‌లో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన వ్యాన్, 9 మంది జలసమాధి

Madhya Pradesh Rajgarh tragedy nine drowned as van swept away in overflowing stream
  • మధ్యప్రదేశ్‌లో పొంగిపొర్లుతున్న వాగులో వ్యాన్ కొట్టుకుపోయిన వైనం
  • ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 9 మంది మృతి
  • హెచ్చరికలను పట్టించుకోకుండా డ్రైవర్ ముందుకు వెళ్లడంతో ఘటన
  • మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోవడంతో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు సురక్షితంగా ఈది ఒడ్డుకు చేరుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, దేవస్ జిల్లా ధన్‌సద్ గ్రామానికి చెందిన 11 మంది ప్రయాణికులు ఓ వ్యాన్‌లో కడ్లవాడ్‌కు వెళుతున్నారు. పచోర్-సారంగ్‌పూర్ రహదారిపై పాడ్నా సమీపంలో ఉదయం 9:30 గంటల సమయంలో ఝిరి వాగు వద్దకు చేరుకున్నారు. భారీ వర్షాలకు వాగు ఉప్పొంగి రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. వాగు దాటవద్దని స్థానిక గ్రామస్థులు, అధికారులు హెచ్చరించినా డ్రైవర్ వినిపించుకోలేదు.

వ్యాన్‌ను ముందుకు నడపడంతో బలమైన నీటి ప్రవాహానికి అది కొట్టుకుపోయి క్షణాల్లో మునిగిపోయింది. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు స్పందన దళం ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వ్యాన్‌ను బయటకు తీసింది. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ ముఖేష్ సింగ్, మరో ప్రయాణికుడు హుకుమ్ సింగ్ ప్రాణాలతో బయటపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన చోట వంతెన నిర్మాణంలో ఉందని, దానిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
Advertisement
Madhya Pradesh
Rajgarh van accident
Jhiri stream tragedy
Nine drowned
Mohan Yadav
Heavy rains

More Telugu News